Infrastructure
ఎంఎండీఆర్ సవరణ చట్టం-2026
प्रविष्टि तिथि:
18 AUG 2026 20:24 PM
గనుల ఆధారిత అభివృద్ధికి మరింత ఊతం
ఖనిజ నియంత్రణ అంశాలు
ప్రస్తుతం ప్రపంచ దేశాలు మూలధనం, సాంకేతికత కోసం ఎంతగా పోటీపడుతున్నాయో ఖనిజ వనరుల కోసం కూడా అంతే తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఉక్కు, సిమెంట్, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, రవాణా, రక్షణ రంగాలన్నీ భూమి నుంచి వెలికితీసే ఖనిజాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఈ వనరుల స్థిరమైన, సముచిత పంపిణీ జాతీయ భద్రతతో పాటు ప్రజల రోజువారీ జీవనోపాధినీ ప్రభావితం చేస్తుంది.
భారత్లో గనుల రంగాన్ని గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1957 కింద నియంత్రిస్తున్నారు. ఈ రంగానికి ఏకరీతి, సమతుల ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గనులు–ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ చట్టం–2026 మూల చట్టాన్ని సవరిస్తోంది. సవరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన షరతులు మినహా ఖనిజ హక్కులు, ఖనిజ నిక్షేపాలు ఉన్న భూములపై రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పన్నులు విధించలేవు.
సంస్కరణ అవసరం: కీలక సమస్యలకు పరిష్కారం
భారతదేశ ఖనిజ సంపద కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ, అది మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తోంది. దీంతో ఖనిజాలపై పన్నుల విధింపు జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశంగా మారింది. నియంత్రణ లేని, రాష్ట్రానికో విధంగా ఉన్న పన్నులు గనుల నిర్వహణ సాధ్యాసాధ్యాలను క్రమంగా దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమలు, కుటుంబాలపై ఖర్చుల భారాన్ని పెంచుతున్నాయి. ఖనిజాలపై పన్నుల విధింపులో అంచనా, ఏకరీతి, హేతుబద్ధతను తీసుకురావడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించేందుకు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ చట్టం–2026 ప్రయత్నిస్తోంది.
ఇంధన భద్రతకు గనుల నిర్వహణ సామర్థ్యమే కీలకం
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో స్థిరమైన దేశీయ గనుల రంగం అత్యవసరం. బాహ్య పరిణామాల వల్ల సరఫరాకు ఆటంకం కలగకుండా కీలక ఖనిజాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బొగ్గు రంగాన్ని మరింత పోటీతత్వంతో, సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండింటికీ ఆచరణీయమైన, అంచనా వేయగల పన్నుల వ్యవస్థ ముందస్తు అవసరం.
ఒకే కార్యకలాపంపై అనేక పన్నులు
ప్రస్తుతం గనుల కార్యకలాపాలపై రాష్ట్రాలు దాదాపు 14 రకాల పన్నులు, రుసుములు, చార్జీలు విధిస్తున్నాయి. వీటిలో రాయల్టీ, వేలం ప్రీమియం, డెడ్ రెంట్, జిల్లా ఖనిజ నిధి చెల్లింపులు, జీఎస్టీ, రవాణా రుసుము ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఖనిజ నిక్షేపాలు ఉన్న భూములపై కూడా అదనంగా పన్నులు విధించడం ప్రారంభించాయి. కొన్ని సందర్భాల్లో ఈ రేటు 20 శాతం వరకు ఉంది. గనుల రంగంపై పడుతున్న ఈ సంచిత, అపరిమిత భారాన్ని చట్టం పరిష్కరిస్తోంది.
వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖనిజాలపై పన్నులు
గ్రాఫైట్ వంటి కీలక ఖనిజాలు, యురేనియం వంటి అణు ఖనిజాలపైనా పన్నులు విధిస్తున్నారు. అధిక పన్నుల కారణంగా ఈ వ్యూహాత్మక ఖనిజాల వెలికితీత ఆర్థికంగా లాభదాయకంగా ఉండటం లేదు. రాష్ట్రాల మధ్య విభిన్న పన్ను రేట్లు ఈ రంగంలో అసమానతలను కూడా సృష్టిస్తున్నాయి. వ్యూహాత్మక ఖనిజ ప్రాజెక్టులు వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యంగా ఉండాలంటే పన్నులను హేతుబద్ధీకరించడం అవసరం.
విదేశీ మారక ద్రవ్యంపై ద్వంద్వ భారం
దేశీయ ఖనిజాల ధరలు దిగుమతి ఖనిజాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉక్కు వంటి వినియోగ పరిశ్రమలు ముడిసరుకును విదేశాల నుంచి కొనుగోలు చేస్తాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ₹10,12,529 కోట్ల విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంది. ఇదే సమయంలో అధిక ధరల కారణంగా దేశీయ ఖనిజాలు ఎగుమతి మార్కెట్లలో అవకాశాలను కోల్పోతున్నాయి. 2025–26లో ఒక్క ఇనుప ఖనిజం ద్వారానే ₹15,136 కోట్ల ఎగుమతి ఆదాయం లభించింది. ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ వ్యయ పెరుగుదలను నియంత్రించడం అత్యవసరం.
జాతీయ ఖనిజ మార్కెట్ విభజన
రాష్ట్రాల మధ్య పన్నుల్లో భారీ వ్యత్యాసం కారణంగా ప్రాంతాలవారీగా ఖనిజ ధరల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలు సరఫరా గొలుసులకు ఆటంకం కలిగిస్తూ రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను పెంచుతున్నాయి. విభిన్న పన్ను రేట్లతో విభజితమైన వ్యవస్థలో ఏకీకృత జాతీయ ఖనిజ మార్కెట్ పనిచేయలేదు. మరింత ఏకరీతిని తీసుకురావాలనేది ఈ చట్టం లక్ష్యం.
చివరకు కుటుంబాలపైనే ఖర్చుల భారం
గనుల దశలో విధించే పన్ను నేరుగా ఖనిజ ధరకు కలుస్తుంది. ఆ తర్వాత ఉక్కు, సిమెంట్, విద్యుత్, నిర్మాణ రంగాల ద్వారా ఇతర ఉత్పత్తుల ధరలకు చేరుతుంది. చివరకు సాధారణ కుటుంబాలు గృహనిర్మాణం, విద్యుత్, నిత్యావసర వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల గనులపై హేతుబద్ధ పన్నుల విధింపు రోజువారీ జీవన వ్యయాలకు సంబంధించిన అంశం.
గిరిజన ప్రాంతాలు సహా అంతటా ఉపాధికి ముప్పు
బొగ్గు రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తుండగా, బొగ్గేతర రంగంపై కోటి మందికి పైగా కార్మికులు ఆధారపడి ఉన్నారు. అధిక పన్నుల కారణంగా ఇప్పటికే కొన్ని గనులు మూతపడ్డాయి. మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభానికి నోచుకోలేదు. తక్కువ లాభాలపై పనిచేసే చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుగా మూతపడటంతో స్థానిక ఉద్యోగాలు కూడా కనుమరుగవుతున్నాయి.
దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రతిబంధకం
పన్నుల నిర్మాణం స్థిరంగా, ముందుగానే అంచనా వేయగలిగేలా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడిదారులు గనుల రంగానికి మూలధనాన్ని కేటాయిస్తారు. ఆకస్మిక మార్పులు పెట్టుబడులను నిరుత్సాహపరుస్తూ సాంకేతికత, మౌలిక సదుపాయాల విస్తరణను మందగింపజేస్తాయి. తయారీ, రక్షణ, నౌకాయానం, నిర్మాణం, పునరుత్పాదక ఇంధన రంగాలన్నీ ఈ ఖనిజ పునాదిపై ఆధారపడి ఉన్నాయి. చట్టం కింద స్థిరమైన వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారుల్లో ఆ విశ్వాసాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చట్టంలోని ప్రధాన నిబంధనలు
ఎంఎండీఆర్ చట్టం–1957లో ఈ చట్టం నిర్దిష్ట సవరణలు చేస్తోంది. ప్రధాన నిబంధనలు:
* కొత్త సెక్షన్ 9డీ – రాష్ట్రాల పన్నులపై పరిమితులు: ఖనిజ హక్కులు లేదా ఖనిజ నిక్షేపాలు ఉన్న భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతోనైనా పన్ను, సెస్ లేదా ఇతర రుసుము విధించకూడదు. ఖనిజ పరిమాణం, విలువ, రాయల్టీ లేదా మరే ఇతర ప్రాతిపదికన విధించే పన్నులు కూడా దీని పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే షరతులు లేదా పరిమితులకు లోబడి మాత్రమే ఇలాంటి పన్నులు విధించవచ్చు.
* గతంలో విధించిన పన్నుల పరిగణన: సవరణ అమలులోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయని లేదా చెల్లింపులు జరగని పన్నులను చెల్లనివిగా పరిగణిస్తారు. అయితే సవరణ అమలుకు ముందు జమ చేసిన లేదా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* సెక్షన్ 13 కింద నిబంధనల రూపకల్పన అధికారం: నిబంధనలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తూ మూల చట్టంలోని సెక్షన్ 13ను సవరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పన్నులు విధించేందుకు వర్తించే షరతులు లేదా పరిమితులను ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి.
రాష్ట్రాల ఆదాయం, ప్రయోజనాలకు పూర్తి రక్షణ
పారదర్శకమైన, వేలం ఆధారిత వ్యవస్థ కింద 2014 నుంచి రాష్ట్రాలకు లభిస్తున్న ఖనిజ ఆదాయం భారీగా పెరిగింది. ఎంఎండీఆర్ సవరణ చట్టం–2026 ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు చేయదు. గనుల ఆదాయంలో అత్యధిక వాటా రాష్ట్రాలకే కొనసాగుతుంది.
దశాబ్ద కాలంగా పెరుగుతున్న ఆదాయం.. అత్యధిక వాటా రాష్ట్రాలకే
2014కు ముందు గనుల రాయితీల మంజూరు, పునరుద్ధరణ విచక్షణాధికారంతో, పారదర్శకత లేకుండా సాగేవి. న్యాయవివాదాలు తరచూ తలెత్తేవి. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో రాష్ట్రాల ఆదాయం పరిమితంగా ఉండేది. ఆ తర్వాత ఖనిజ ఉత్పత్తి ద్వారా రాష్ట్రాలకు లభించే ఆదాయం 354 శాతం పెరిగింది. బొగ్గుతో కలిపి రాష్ట్రాలకు ₹7 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించింది.
ప్రస్తుతం గనుల రంగ ఆదాయంలో దాదాపు 90 శాతం రాష్ట్రాలకే చేరుతోంది. బొగ్గు, బొగ్గేతర ఖనిజాల మొత్తం ఆదాయంలో రాష్ట్రాల వాటా దశాబ్ద కాలంలో దాదాపు 28 శాతం పాయింట్లు పెరిగి, 2025–26లో సుమారు ₹1,14,549.28 కోట్లకు చేరింది. బొగ్గు రంగం ఈ మార్పును స్పష్టంగా చూపుతోంది. 2014–15లో మొత్తం ఆదాయంలో 55.6 శాతానికి సమానమైన ₹11,947.97 కోట్లు రాష్ట్రాలకు లభించగా, 2025–26లో 89.5 శాతానికి సమానమైన ₹32,183.09 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ వాటా ₹9,534.24 కోట్ల నుంచి ₹3,771.82 కోట్లకు తగ్గింది. శాతం పరంగా ఇది 22.97 నుంచి 10.5 శాతానికి తగ్గింది.
ప్రధాన ఖనిజ రాష్ట్రాలకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో ₹13,586.16 కోట్లు లభించగా, 2025–26లో ఈ మొత్తం ₹82,366.19 కోట్లకు పెరిగింది. పన్నెండేళ్లలో ఇది 16.20 శాతం సంచిత వార్షిక వృద్ధి రేటు. 2015–16 నుంచి 2025–26 మధ్య ఈ రాష్ట్రాలకు ₹5 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించగా, కేంద్రానికి దాదాపు ₹82 వేల కోట్లు మాత్రమే చేరాయి. ఈ స్థితిలో చట్టం ఎలాంటి మార్పు చేయదు.
అదనపు ఆదాయ వనరుగా వేలం ప్రీమియం.. లావాదేవీల స్థాయిలో వాటా
2015లో ప్రవేశపెట్టిన వేలం వ్యవస్థ రాష్ట్రాలకు పూర్తిగా కొత్త ఆదాయ వనరుగా వేలం ప్రీమియాన్ని అందించింది. 2015 నుంచి పనిచేస్తున్న 1,200 గనుల ద్వారా రాష్ట్రాలు ₹2.32 లక్షల కోట్ల రాయల్టీని వసూలు చేశాయి. వేలంలో కేటాయించిన 100 గనుల నుంచే ₹96 వేల కోట్ల వేలం ప్రీమియాన్ని వసూలు చేశాయి. ఒడిశా వేలంలో కేటాయించిన 79 బ్లాకుల్లో 35 బ్లాకులను కార్యకలాపాల్లోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా 2020–21 నుంచి 2025–26 మధ్య దాదాపు ₹87 వేల కోట్ల ప్రీమియం ఆదాయాన్ని పొందింది.
ఒకే సరుకులోనూ ఈ పంపిణీ స్పష్టంగా కనిపిస్తుంది. టన్ను ఇనుప ఖనిజం సగటు విక్రయ ధర ₹3 వేలుగా ఉంటే, గనుల కంపెనీ ₹3,150 చెల్లిస్తుంది. ఇందులో ₹3,016 రాష్ట్రానికి చేరుతుంది. చట్టం కింద కూడా ఇదే విధానం కొనసాగుతుంది.
చిన్న ఖనిజాలపై పూర్తి నియంత్రణ రాష్ట్రాలకే
దాదాపు 50 చిన్న ఖనిజాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉన్నాయి. ఇసుక, కంకర, బంకమట్టి, సిలికా, గ్రానైట్, పాలరాయి, జిప్సం, లేటరైట్ సహా ఈ ఖనిజాలపై చట్టం ఎలాంటి ప్రభావం చూపదు. ఈ విభాగంపై రాష్ట్రాల అధికారం మునుపటిలాగే కొనసాగుతుంది.
2014 నుంచి ఖనిజ రంగ సంస్కరణలు: కీలక మైలురాళ్లు
దశాబ్ద కాలంగా చేపట్టిన నియంత్రణ, ఆర్థిక, సంస్థాగత సంస్కరణల ఫలితంగా రాష్ట్రాల ఆదాయం పెరిగింది. ఈ చర్యలు ఖనిజ రంగాన్ని పారదర్శకంగా, పోటీతత్వంతో, భవిష్యత్ డిమాండ్ను ఎదుర్కొనేందుకు మరింత సంసిద్ధంగా మార్చాయి.
పోటీతత్వ ఈ-వేలం, గనుల ప్రారంభంలో రికార్డు సంవత్సరం
గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి 2015లో చేసిన సవరణ గనుల రాయితీల విచక్షణాధికార కేటాయింపులకు ముగింపు పలికింది. అప్పటి నుంచి 17 రాష్ట్రాల్లో 723 ప్రధాన ఖనిజ బ్లాకులను వేలం వేశారు. 140 బ్లాకులతో రాజస్థాన్, 127 బ్లాకులతో మధ్యప్రదేశ్, 76 బ్లాకులతో ఒడిశా ముందంజలో ఉన్నాయి. 212 బ్లాకుల వేలం, 36 బ్లాకుల్లో కార్యకలాపాల ప్రారంభంతో 2025–26 ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు అత్యుత్తమ సంవత్సరంగా నిలిచింది. బొగ్గు రంగంలో 141 గనులను వేలం వేయగా, 23 గనుల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఉత్పత్తిలో వృద్ధి, ప్రపంచస్థాయి స్థానం
2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ఖనిజాల ఉత్పత్తి విలువ 26.8 శాతం పెరిగింది. ఇనుప ఖనిజ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 313 మిలియన్ టన్నులకు, సున్నపురాయి ఉత్పత్తి 484 మిలియన్ టన్నులకు చేరింది. గత రెండేళ్లలో ప్రతి ఏడాదీ బొగ్గు ఉత్పత్తి వంద కోట్ల టన్నులను దాటింది. 2014 నుంచి బొగ్గేతర ఖనిజ ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం సున్నపురాయి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో, జింక్లో మూడో స్థానంలో, ఇనుప ఖనిజంలో నాలుగో స్థానంలో, బాక్సైట్లో ఐదో స్థానంలో ఉంది.
జాతీయ కీలక ఖనిజాల మిషన్, విదేశీ వనరుల సేకరణ
2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ₹2,600 కోట్ల బడ్జెట్ సహాయంతో కలిపి ₹16,300 కోట్ల వ్యయంతో జాతీయ కీలక ఖనిజాల మిషన్కు 2025 జనవరి 29న ఆమోదం లభించింది. భారత భూవైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ(జీఎస్ఐ), జాతీయ ఖనిజ అన్వేషణ, అభివృద్ధి ట్రస్టు(ఎన్ఎంఈడీటీ) 1,200 కీలక ఖనిజ ప్రాజెక్టుల లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ₹3,828.52 కోట్లతో ఎన్ఎంఈడీటీ మంజూరు చేసిన 777 ప్రాజెక్టుల్లో 255 కీలక ఖనిజాలకు సంబంధించినవి. 2025 సవరణతో విదేశాల్లో అన్వేషణకు సహాయం అందించే అధికారం కూడా ట్రస్టుకు లభించింది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అర్జెంటీనాలో ప్రత్యేక లిథియం అన్వేషణ హక్కులను పొందింది.
శుద్ధి, రీసైక్లింగ్, పరిశోధన సామర్థ్యం
కీలక ఖనిజాల రీసైక్లింగ్ కోసం ₹1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని 2025 అక్టోబరు 2న ప్రారంభించారు. 270 వేల టన్నుల వార్షిక సామర్థ్య లక్ష్యానికి బదులుగా 58 సంస్థలు ఏటా 850 వేల టన్నుల సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్రలో కీలక ఖనిజాల శుద్ధి పార్కులకు ₹500 కోట్ల సహాయం అందిస్తున్నారు. వరుసగా మూడు బడ్జెట్లలో కీలక ఖనిజాలు, లిథియం–అయాన్ బ్యాటరీ వ్యర్థాలు, శుద్ధి యంత్ర పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తొలగించారు. మహా మిషన్ కింద ₹210 కోట్లతో తొమ్మిది సంస్థలను ప్రతిభా కేంద్రాలుగా గుర్తించారు.
విస్తృతమైన, మెరుగైన నిధులతో కూడిన అన్వేషణ వ్యవస్థ
2014 నుంచి ఖనిజ అన్వేషణ కార్యకలాపాలు దాదాపు 200 రెట్లు పెరిగాయి. ఈ పనుల కోసం ప్రస్తుతం 51 ప్రైవేటు సంస్థలకు గుర్తింపు ఇచ్చారు. ఎన్ఎంఈడీటీకి చెల్లించే వాటాను 3 శాతానికి పెంచారు. ప్రత్యక్ష అన్వేషణ ఖర్చుల్లో సగం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. అన్వేషణ లైసెన్స్దారులకు గరిష్ఠ పరిమితి ₹20 కోట్లు కాగా, సమ్మిళిత లైసెన్స్దారులకు ₹8 కోట్లుగా ఉంది. జీఎస్ఐ 2025–26 క్షేత్ర సీజన్లో 457 ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిలో 230 కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించినవి. ఎన్ఎంఈడీటీ 2024–25లో ఇలాంటి 62 ప్రాజెక్టులకు, 2025–26లో 84 ప్రాజెక్టులకు నిధులు అందించింది.
సరళమైన కార్యకలాపాలు, డిజిటల్ పర్యవేక్షణ
గనుల లీజుల విస్తీర్ణాన్ని ఒకసారి 10 శాతం వరకు, సమ్మిళిత లైసెన్సుల విస్తీర్ణాన్ని 30 శాతం వరకు పొడిగించుకోవచ్చు. సొంత అవసరాల కోసం నిర్వహించే గనుల నుంచి ఖనిజ విక్రయాలపై పరిమితిని తొలగించారు. లీజులో కీలక, వ్యూహాత్మక లేదా లోతైన ఖనిజాలను చేర్చడానికి అదనపు చెల్లింపు అవసరాన్ని కూడా తొలగించారు. రాష్ట్రాలతో కలిసి రూపొందించిన ఏకీకృత గనుల పోర్టల్ వేలం నుంచి కార్యకలాపాల ప్రారంభం వరకు బ్లాకు పూర్తి జీవిత చక్రాన్ని పర్యవేక్షిస్తుంది. బొగ్గు, ఖనిజ ఎక్స్ఛేంజీలు న్యాయమైన ధరల నిర్ధారణకు మరింత సహకరిస్తాయి.
గనుల ప్రభావిత సముదాయాలకు ప్రత్యక్ష ప్రయోజనాలు
స్థానిక సంక్షేమం కోసం ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కల్యాణ్ యోజన(పీఎంకేకేకేవై), 656 డిస్ట్రిక్ట్ మినెరల్ ఫౌండేషన్స్(డీఎంఎఫ్) ఏర్పాటు చేశారు. వీటిలో 106 ఆకాంక్షిత జిల్లాల్లో ఉన్నాయి. డీఎంఎఫ్ నిధి మొత్తం స్థానిక ప్రాజెక్టులకే వెళ్తుంది. ఏ పనులకు నిధులు కేటాయించాలో జిల్లా యంత్రాంగం నిర్ణయిస్తుంది. రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, తాగునీరు, మెరుగైన జీవన పరిస్థితులకు ఈ నిధులు సహకరిస్తాయి. కొత్త చట్టం కింద కూడా ఈ వసూళ్లు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి.
చట్ట ప్రభావం
ఖనిజ రంగ ఆర్థిక వ్యవస్థలో స్పష్టత, స్థిరత్వం, ముందస్తు అంచనాకు అవకాశం కల్పించేందుకు ఎంఎండీఆర్ సవరణ చట్టం–2026 ప్రయత్నిస్తోంది. ఇది జాతీయ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అంచనా.
|
గతంలో
|
ఇకపై
|
|
ప్రతి రాష్ట్రంలో గనులపై వేర్వేరు పన్నులు విధించేవారు.
|
కొత్త సెక్షన్ 9డీ కింద కేంద్రం నిర్దేశించే ఏకీకృత పన్నుల వ్యవస్థ వర్తిస్తుంది.
|
|
గనుల కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కూడా కొత్త పన్నులు విధించే అవకాశం ఉండేది.
|
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన షరతుల పరిధిలో తప్ప రాష్ట్రాలు కొత్త పన్నులు విధించలేవు.
|
|
గత కాలానికి సంబంధించిన పన్ను బకాయిలపై ఎప్పుడైనా డిమాండ్లు జారీ చేసే అవకాశం ఉండేది.
|
పెండింగ్లో ఉన్న గత కాలపు పన్ను బకాయిలన్నింటినీ ఇప్పుడు చెల్లనివిగా ప్రకటించారు.
|
|
చిన్న, మధ్య తరహా గనుల నిర్వాహకులపైనే అత్యధిక భారం పడేది.
|
ప్రస్తుతం ప్రతి గనుల నిర్వాహకుడికీ న్యాయమైన, సమాన వ్యవస్థ ప్రయోజనం లభిస్తుంది.
|
చట్టంతో కీలక ప్రయోజనాలు
ఎంఎండీఆర్ సవరణ చట్టం–2026 గనుల రంగాన్ని బలోపేతం చేస్తూ సమ్మిళిత జాతీయ అభివృద్ధికి సహకరిస్తోంది.
* సామాన్య ప్రజలకు ప్రయోజనం: పోటీతత్వంతో కూడిన బొగ్గు ధరలు విద్యుత్ ఖర్చులు తగ్గడానికి సహకరిస్తాయి. రోజువారీ జీవితంలో కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయి. తక్కువ ఖనిజ ధరలు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, ఉపాధిని బలోపేతం చేస్తాయి.
* తయారీ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థకు బలం: బొగ్గు ఇంధనాన్ని అందిస్తుండగా, ఇనుప ఖనిజం, సున్నపురాయి, బాక్సైట్ ఉక్కు, సిమెంట్, అల్యూమినియం ఉత్పత్తికి సహకరిస్తాయి. ఆధునిక పరిశ్రమలు, విద్యుత్, రక్షణ రంగాలకు రాగి కూడా తోడ్పడుతుంది. అందువల్ల విద్యుత్, తయారీ, రైల్వేలు, రహదారులు, గృహనిర్మాణం, రవాణా, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ చట్టం ప్రయోజనం కల్పిస్తుంది.
* వికసిత్ భారత్ కోసం చట్టం: మరింత పోటీతత్వం, పారదర్శకత, ముందస్తు అంచనాకు అవకాశం, పెట్టుబడిదారులకు అనుకూలత కలిగిన గనుల రంగాన్ని ఈ చట్టం రూపొందిస్తోంది. పెట్టుబడులు, ఉత్పత్తి, ఉపాధి, ఇంధన భద్రత, జాతీయ భద్రత, స్వావలంబనను బలోపేతం చేస్తోంది.
భవిష్యత్ కార్యాచరణ
భారత ఖనిజ పాలనను ఆధునికీకరించే దిశగా గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం–2026 కీలక ముందడుగు. స్థిరమైన, ఏకరీతి ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇవ్వడం ద్వారా ఖనిజ అన్వేషణ, కీలక ఖనిజాల భద్రత, సుస్థిర వనరుల అభివృద్ధిని బలోపేతం చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత్ భారత్ దిశగా దేశ ప్రస్థానాన్ని ఈ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్తాయి.
References:
Parliament of India:
https://sansad.in/ls/legislation/bills
Office of Union Minister for Coal and Mines:
https://x.com/KishanReddyOfc/status/2086816534840905747/photo/1
***
(तथ्य सामग्री आईडी: 150959)
आगंतुक पटल : 7
Provide suggestions / comments