Technology
భారతదేశ సౌరశక్తి వేగం
129 గిగావాట్ల సౌరశక్తితో మొత్తం స్థాపిత సామర్థ్యంలో 50% దాటిన శిలాజేతర ఇంధన వాటా
Posted On:
06 DEC 2025 9:51AM
కీలకాంశాలు
- 2014లో 3 గిగావాట్లుగా ఉన్న భారతదేశ సౌర విద్యుత్ సామర్థ్యం 2025 నాటికి 129 గిగావాట్లకు పెరిగింది.
- భారతదేశ 500 గిగావాట్ల సామర్థ్యంలో శిలాజేతర విద్యుత్ 50% దాటింది.
- 2025 డిసెంబర్ నాటికి పీఎం సూర్యఘర్ కింద దాదాపు 24 లక్షల గృహాలపై 7 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యంతో సౌరవిద్యుత్ ఏర్పాటైంది. ఇందుకోసం రూ.13,464.6 కోట్ల సబ్సిడీ విడుదలైంది.
- పీఎం-కుసుమ్ పథకం వ్యవసాయంలో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచింది. కాంపొనెంట్-బీ కింద దాదాపు 9.2 లక్షల స్టాండ్అలోన్ సోలార్ పంపులను అందుబాటులోకి తెచ్చింది.
- 2025 అక్టోబర్ 31 నాటికి దేశంలోని 13 రాష్ట్రాల్లో 40 గిగావాట్ల సంయుక్త సామర్థ్యంతో కూడిన 55 సోలార్ పార్కులకు ఆమోదం లభించింది.
పరిచయం
భారతదేశ సౌరశక్తి ప్రయాణం ప్రపంచంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో అగ్రగామిగా ఆవిర్భవించడానికి శక్తినిస్తోంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఏ) వ్యవస్థాపక సభ్యదేశంగా భారత్ ఉంది. ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం సైతం భారత్లోని గురుగ్రామ్లో ఉంది. తద్వారా 125కి పైగా సభ్యదేశాలలో సౌరశక్తి విస్తరణ, ఆర్థిక సహకారం, సాంకేతికత బదిలీకి భారత్ కృషి చేసింది. 2025 అక్టోబర్లో 8వ ఐఎస్ఏ అసెంబ్లీకి భారత్లోని న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రతినిధులు పాల్గొని ధృఢమైన సౌరశక్తి విలువ గొలుసులు, అందరికీ అందుబాటులో ఉంచడం, సౌర శక్తిని సులభంగా అమలు చేసేలా వ్యూహాలను రూపొందించారు.
గత దశాబ్దకాలంగా సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాల పెరుగుదల భారతదేశ మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం సౌరశక్తి సామర్థ్యం 129 గిగావాట్లు ఉండగా, శిలాజేతర విద్యుత్ సామర్థ్యం 259 గిగావాట్లు దాటింది. ఇది 2025 అక్టోబర్ నాటికి దేశ మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% కంటే అధికం. తక్కువ-కర్బన శక్తి వైపు ఇది చరిత్రాత్మక మార్పును సూచిస్తోంది.
దేశంలో వేగవంతమైన విస్తరణను, ప్రపంచ సహకారంతో జత చేయడం ద్వారా భారతదేశం ప్రపంచానికి ప్రమాణాలను నిర్దేశించే దృఢమైన, స్థిరమైన, సౌరశక్తితో కూడిన ఇంధన భవిష్యత్తుకు పునాది వేస్తోంది.
హరిత పరివర్తన దిశగా: పంచామృత్ ప్రణాళిక కింద భారతదేశ ప్రణాళిక
పునరుత్పాదక ఇంధన విస్తరణలో గణనీయమైన పురోగతికి మార్కెట్ పరిస్థితులతో పాటు దృఢమైన విధానం, వ్యూహాత్మక ప్రణాళిక దోహదపడింది. గ్లాస్గోలో జరిగిన కాప్26(2021 నవంబర్)లో పంచామృత్ డిక్లరేషన్ పేర్కొన్న జాతీయ లక్ష్యాలు, ప్రపంచ వాతావరణ కట్టుబాట్లు స్థిరమైన ఇంధన భవిష్యత్తు కోసం స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నాయి.
పంచామృత్ ఫ్రేమ్వర్క్లోని ఐదు కీలక అంశాలు:
- 2030 కల్లా 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత స్థాపిత విద్యుత్ సామర్థ్యం - సౌర, పవన, జీవద్రవ్య, జల, అణు శక్తిని కలుపుకొని భారతదేశ విద్యుత్లో స్వచ్ఛ ఇంధన వాటాను గణనీయంగా పెంచడం లక్ష్యం.
- 2030 నాటికి శిలాజేతర వనరుల నుంచి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% వాటా - ఇంధన పోర్ట్ఫోలియోను వైవిధ్యపరిచి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రూపొందించిన లక్ష్యం.
- 2030 నాటికి మొత్తం కర్బన ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గించడం - స్వచ్ఛ ఇంధనం, మెరుగైన సామర్థ్య చర్యల ద్వారా గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించాలనే భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
- 2030 నాటికి ఆర్థిక వ్యవస్థపై కర్బన తీవ్రతను 45% తగ్గించడం(2005 స్థాయిలతో పోలిస్తే): ఇంధన సామర్థ్యం, తక్కువ-కర్బన సాంకేతికతలు, స్థిరమైన పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించడం.
- 2070 కల్లా నెట్ జీరో ఉద్గారాలు: కర్బన తొలగింపుతో ఉద్గారాలను సమతుల్యం చేయడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యం.

భారతదేశ సౌరశక్తి: 40 రెట్లకు పైగా పెరుగుదల
గత దశాబ్దంలో సౌర ఇంధన రంగం అపూర్వమైన వేగంతో విస్తరించింది. 2014లో కేవలం 3 గిగావాట్ల నుంచి 2025 అక్టోబర్ నాటికి 129.92 గిగావాట్లకు పెరిగింది. ఇది అద్భుతమైన 40 రెట్లకు పైగా పెరుగుదల. ఈ వేగవంతమైన వృద్ధితో పవన, జల, జీవద్రవ్య ఇంధన సామర్థ్యాలను సౌరశక్తి అధిగమించింది. పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద వాటాను అందిస్తోంది.

సౌరశక్తి సామర్థ్యంలో పెరుగుతున్న మొత్తం పునరుత్పాదక ఇంధన వాటాలోనూ స్థిరమైన పెరుగుదలకు దోహదపడుతోంది. ఈ విజయాలు తక్కువ-కర్బన ఇంధనం దిశ పరివర్తన కోసం భారతదేశ నిబద్ధతను నొక్కిచెబుతున్నాయి. దృఢమైన, స్థిరమైన, సురక్షితమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించడంలో సౌరశక్తి కీలకపాత్రను ప్రధానంగా చాటుతున్నాయి.
-------బాక్స్----------
ప్రపంచ పునరుత్పాదక ఇంధనంలో భారతదేశ స్థానం
ఐఆర్ఈఎన్ఏ పునరుత్పాదక విద్యుత్తు గణాంకాలు 2025 ప్రకారం భారత్ స్థానం:
- సౌర విద్యుత్తులో 3వ స్థానం
- పవన విద్యుత్తులో 4వ స్థానం
- మొత్తం స్థాపిత పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో 4వ స్థానం
ప్రపంచ స్వచ్ఛ ఇంధన విపణులలో పెరుగుతున్న భారతదేశ ప్రభావం, సరసమైన, అందుబాటులో ఉండే, సుస్థిరమైన శక్తిని అందించడంలో దేశ కీలకపాత్రను ఈ ర్యాంకింగులు నొక్కిచెబుతున్నాయి.
------------------------------------
అమలవుతున్న విధానం: భారతదేశ సౌర ఆకాంక్షలు వేగవంతం
నెట్-జీరో ఉద్గారాలు సాధించాలనే భారతదేశ నిబద్ధత వరుసగా ప్రభుత్వం చేపడుతున్న భారీ కార్యక్రమాల ద్వారా ఆచరణలోకి మారింది. పునరుత్పాదక ఇంధన స్వీకరణను వేగవంతం చేయడానికి, స్థిరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశ స్వచ్ఛ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాల రూపకల్పన జరిగింది.
పీఎం సూర్యఘర్
పునరుత్పాదక ఇంధనం, నెట్-జీరో ఉద్గారాల దిశగా భారతదేశ ప్రయత్నంలోని కీలక స్తంభాలలో పీఎం సూర్య ఘర్ ఒకటి. 2024 ఫిబ్రవరి 13న మంత్రివర్గ ఆమోదంతో, రూ.75,021 కోట్ల వ్యయంతో ఈ పథకం ప్రారంభమైంది. ప్రతీ నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించేలా కోటి గృహాలకు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తు వ్యవస్థలను అందించడం దీని లక్ష్యం.
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలనే భారతదేశ నిబద్ధతకు ఈ పథకం మద్దతునిస్తోంది.
2025 డిసెంబర్ నాటికి పీఎం సూర్య ఘర్ పథకం కింద 23.9 లక్షల గృహాల పైకప్పుపై 7 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యంలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యింది. ఇందుకుగానూ రూ.13,464.6 కోట్ల సబ్సిడీ విడుదలైంది. తద్వారా కోటి సౌర శక్తి గృహాల లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ పథకం పయనిస్తోంది.

జాతీయ సోలార్ మిషన్
దేశవ్యాప్తంగా సౌరశక్తిని పెద్ద ఎత్తున విస్తరించే లక్ష్యంతో 2010 జనవరిలో భారత ప్రభుత్వం జాతీయ సోలార్ మిషన్(ఎన్ఎస్ఎం) అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను, తక్కువ-కర్బన భవిష్యత్తు పట్ల భారతదేశ నిబద్ధతను సాధించడంలో ఈ మిషన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఎన్ఎస్ఎం, దాని అనుబంధ కార్యక్రమాల కింద విధానపరమైన మద్దతుతో గత దశాబ్దకాలంలో సౌర శక్తి సామర్థ్యం భారీ వృద్ధిని సాధించింది. ఈ రంగానికి సంబంధించిన వృద్ధికి వివిధ రకాల సౌర సాంకేతికతలు దోహదపడ్డాయి. అవి:
- నేలపై ఏర్పాటుచేసిన సౌర విద్యుత్కేంద్రాలు: 98.72 గిగావాట్లు
- గ్రిడ్తో అనుసంధానమైన పైకప్పు సౌర వ్యవస్థలు: 22.42 గిగావాట్లు
- హైబ్రిడ్ సౌర ప్రాజెక్టులు(సౌర విభాగాలు మాత్రమే): 3.32 గిగావాట్లు
- ఆఫ్-గ్రిడ్ సౌర వ్యవస్థలు: 5.45 గిగావాట్లు
ఈ పురోగతి పునరుత్పాదక విద్యుత్తు విస్తరణలో భారతదేశ నిరంతర నాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది. పారిస్ ఒప్పందానికి కట్టుబడి, కాప్ శిఖరాగ్ర సమావేశాలలో పునరుద్ఘాటించినట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
సౌర పీవీల కోసం ఉత్పత్తి-అనుసంధానిత ప్రోత్సాహకం(పీఎల్ఐ)
భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్శ శాఖ(ఎంఎన్ఆర్ఈ) అధిక సామర్థ్యం గల సౌర పీవీ మాడ్యూళ్లలో గిగావాట్-స్థాయి తయారీ సామర్థ్యాన్ని సాధించేందుకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ అనే కార్యక్రమం కింద ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని మొత్తం వ్యయం రూ.24,000 కోట్లు. దేశీయంగా అధిక సామర్థ్యం గల సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీనికి ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఈ పథకం ప్రారంభించి తర్వాత ఐదేళ్ల పాటు వాస్తవ విక్రయాలు, సామర్థ్య పనితీరు ఆధారంగా పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ పథకం రెండు విడతల్లో అమలవుతుంది. మొదటి విడత(రూ.4,500 కోట్లతో 2021 ఏప్రిల్లో ఆమోదం పొందింది). రెండో విడత(రూ.19,500 కోట్లతో 2022 సెప్టెంబర్లో ఆమోదం పొందింది). దీని కింద 48,337 మెగావాట్ల సమీకృత, పాక్షిక సమీకృత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటుచేసేందుకు లెటర్స్ ఆఫ్ అవార్డ్ జారీ అయ్యాయి.
2025 సెప్టెంబర్ నాటికి సౌర పీవీల కోసం పీఎల్ఐ పథకం రూ.52,900 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 44,000 ఉద్యోగాలను సృష్టించింది. ఈ పథకం స్థానిక వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. దృఢమైన సౌర పీవీ వ్యవస్థ అభివృద్ధిని, అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తుంది. భారతదేశ ఇంధన స్వయం సమృద్ధిని బలపరుస్తుంది.
పీఎం కుసుమ్ పథకం
2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఈవమ్ మహాభియాన్(పీఎం-కుసుమ్) పథకం రైతులను విద్యుత్తు ఉత్పత్తిదారులుగా మార్చడం ద్వారా వ్యవసాయంలో సౌర విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలోకి మూడు భాగాలు:
- కాంపొనెంట్ ఏ: బంజరు లేదా సాగు చేయని భూముల్లో చిన్నపాటి గ్రిడ్కు అనుసంధానమైన పునరుత్పాదక ఇంధన ప్లాంట్ల ఏర్పాటు.
- కాంపొనెంట్ బీ: గ్రిడ్ పరిమితంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్టాండ్అలోన్ సౌర పంపుల ఏర్పాటు.
- కాంపొనెంట్ సీ: ఇప్పటికే గ్రిడ్కు అనుసంధానమైన ఉన్న వ్యవసాయ పంపులను సౌర విద్యుత్తుకు మార్చడం. ఇది రైతులు మిగులు విద్యుత్తును గ్రిడ్కు అందించేందుకు అవకాశం కల్పిస్తుంది.

2025 అక్టోబర్ నాటికి కాంపొనెంట్ బీ కింద 9 లక్షల కంటే ఎక్కువ స్టాండ్అలోన్ పంపులు ఏర్పాటయ్యాయి. కాంపొనెంట్ సీ కింద మొత్తం 10,535 గ్రిడ్కు అనుసంధానమైన పంపులు సౌర విద్యుత్తుకు మారాయి. 9,74,458 ఫీడర్ స్థాయి సౌర పంపులు(ఎఫ్ఎల్ఎస్) ఏర్పాటయ్యాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. 15 హెచ్పీ వరకు ఉన్న సౌర పంపులకు సబ్సిడీని పొడిగించింది. దీనిని కేంద్ర ఆర్థిక సహకారం(సీఎఫ్ఏ) 30% నుంచి 50% వరకు ఉంఉటంది. ఇది ఈశాన్య, కొండ ప్రాంతాలు, వంటి మారుమూల ప్రాంతాల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
సోలార్ పార్కులు & అల్ట్రా-మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు
సోలార్ పార్కులు, అల్ట్రా-మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకాన్ని 2014 డిసెంబరులో నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ(ఎంఎన్ఆర్ఈ) 20 గిగావాట్ల ఆరంభ లక్ష్యంతో ప్రారంభించింది. 2017 మార్చిలో ఈ లక్ష్యాన్ని 40 గిగావాట్లకు పెంచింది. 2025 అక్టోబర్ 31 నాటికి 13 రాష్ట్రాల్లో 39,973 మెగావాట్ల సంయుక్త సామర్థ్యంతో కూడిన సోలార్ పార్కులకు ఆమోదం లభించింది. ఈ పార్కుల్లో ఇప్పటికే 14,922 మెగావాట్ల సామర్థ్యంతో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు పూర్తయ్యింది. మిగతావి వివిధ దశల్లో అమలులో ఉన్నాయి.
ఆమోదం లభించిన అన్ని సోలార్ పార్కుల పూర్తి కోసం ఈ పథకాన్ని 2029 మార్చి 31 వరకు పొడిగించారు. ఈ పార్కులు భారీ స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వీలుగా భూసేకరణ, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు, రోడ్లు, నీటి సదుపాయాలు వంటి భాగస్వామ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నాయి.
సౌరశక్తి కోసం అంతర్జాతీయ కూటములకు భారతదేశ నాయకత్వం
వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయ లక్ష్యాలకు చురుకుగా దోహదపడటం ద్వారా స్వచ్ఛ ఇంధనం, వాతావరణ కార్యాచరణలో భారతదేశం ప్రపంచ నాయకుడిగా నిలబడింది. మిషన్ ఇన్నోవేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ వ్యవస్థాపక సభ్యదేశంగా స్మార్ట్ గ్రిడ్లు, సుస్థిర జీవ ఇంధనాలు, ఆఫ్-గ్రిడ్ విద్యుదీకరణలపై దృష్టిసారించే కీలక కార్యక్రమాలకు భారత్ సహ-నాయకత్వం వహిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ సాంకేతికత విస్తరణ పట్ల భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.
గ్లాస్గోలో జరిగిన కాప్26(2021 నవంబర్)లో భారత్ తన పంచామృత్ ప్రణాళికను ఆవిష్కరించింది. 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాలను సాధించాలనే నిబద్ధత ఇందులో ప్రధానమైనది. ఇది భారతదేశ వాతావరణ నాయకత్వానికి ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. 2030 నాటికి శిలాజేతర వనరుల నుంచి 50% విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందే అధిగమించి, ప్రపంచ స్వచ్ఛ ఇంధన నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఫ్రాన్స్తో కలిసి అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) ఏర్పాటుచేయడం వంటి వ్యూహాత్మక కూటముల ద్వారా సౌరశక్తిలో భారత్ నాయకత్వం వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఐఎస్ఏ సభ్యదేశాలలో సౌర శక్తి రంగంలో ప్రపంచ పెట్టుబడులను సమీకరించడం, విస్తరణను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీ, ఆర్థిక సమీకరణ, సామర్థ్య నిర్మాణం కోసం అంకితమై పనిచేసే ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ.
-------బాక్స్-------
ఐఎస్ఏ 8వ అసెంబ్లీ - కీలకాంశాలు
- 2025 అక్టోబర్ 27 నుంచి 30 వరకు న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) 8వ అసెంబ్లీ జరిగింది.
- భారతదేశ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 125కి పైగా సభ్యదేశాల, నియమావళి పాటించేందుకు అంగీకరించిన దేశాలకు చెందిన 30కి పైగా మంత్రిత్వ శాఖల నుంచి 550 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
- సౌర శక్తి కేవలం విద్యుత్తు ఉత్పత్తి కోసం మాత్రమే కాదని, ఇది సాధికారత, సమ్మిళిత అభివృద్ధి కోసమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానంగా ప్రస్తావించారు.
- సౌర విప్లవంలో ఏ మహిళ, ఏ రైతు, ఏ గ్రామం, ఏ చిన్న దీవి కూడా వెనుకబడకుండా చూడాలనే సమ్మిళిత అజెండా ప్రారంభమైంది.
- “ఒక సూర్యూడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్” సంకల్పాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ కల్పన, గ్రామీణ జీవనోపాధి, మహిళా నాయకత్వం, డిజిటల్ వినియోగం అనేవి విజయానికి కొలమానాలుగా పేర్కొన్నారు.
- కాటలిటిక్ ఫైనాన్స్ హబ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ & డిజిటలైజేషన్, రీజినల్ & కంట్రీ ఎంగేజ్మెంట్, టెక్నాలజీ రోడ్మ్యాప్ & పాలసీ అనే నాలుగు వ్యూహాత్మక అంశాలను నిర్వచించారు.
----------------------------
ప్రపంచవ్యాప్తంగా సౌర శక్తి అమలు కోసం వ్యూహాలను చర్చించడానికి 2025 అక్టోబరులో జరిగిన ఐఎస్ఏ 8వ అసెంబ్లీ దాదాపు 125 దేశాల మంత్రులు, ప్రతినిధులను ఒక్కచోటకు చేర్చింది. నిధులు, దృఢమైన సరఫరా గొలుసులు, సరసమైన పునరుత్పాదక విద్యుత్తుకు సమ్మిళిత సౌలభ్యం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టి నిబద్ధతను ఈ అసెంబ్లీ పునరుద్ఘాటించింది. ప్రపంచ సౌర అజెండా రూపకల్పనలో భారతదేశ కీలకపాత్రను నొక్కిచెప్పింది.
దీనికి తోడు 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్(ఓఎస్ఓడబ్ల్యూఓజీ) కార్యక్రమం వివిధ దేశాల పునరుత్పాదక ఇంధన గ్రిడ్ల అనుసంధానంపై దృష్టి సారిస్తోంది. సౌర సంపన్న ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తును సరఫరా చేయడానికి వీలు కల్పించడం ద్వారా ఇంధన భద్రత, సుస్థిరతను ప్రోత్సహించే అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన వ్యవస్థను తయారుచేయడం దీని లక్ష్యం.
ఈ విజయాలు వాతావరణ నాయకత్వం, సమతుల అభివృద్ధి విధానంలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపును పెంచాయి. జీ20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్(2023) కూడా “సుస్థిరాభివృద్ధి కోసం జీవనశైలుల(లైఫ్)”ను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు వాతావరణ, పర్యావరణ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రశంసించింది. ఇదేవిధంగా ఇంటర్నేషనల్ ఎనెర్జీ ఏజెన్సీ(ఐఈఏ) సైతం ప్రపంచ ఇంధన భవిష్యత్తుకు భారత్ లేకుండా ప్రణాళిక రచించలేమని పేర్కొనడం ద్వారా భారత్ను ప్రపంచ ఇంధన మార్పులలో ఒక ప్రధాన చోదక శక్తిగా అభివర్ణించింది. ప్రపంచ స్వచ్ఛ ఇంధన పరివర్తనను రూపొందించడంలో, సుస్థిర, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడంలో భారతదేశ కీలకపాత్రను ఈ ధ్రువీకరణలు నొక్కి చెబుతున్నాయి.
ముగింపు
నిర్దిష్ట విధానం, సాంకేతిక ఆవిష్కరణ, వ్యూహాత్మక సహకారం ఒక దేశ ఇంధన రంగాన్ని ఎలా మార్చగలదో భారతదేశ సౌర ప్రయాణం ఉదహరణగా నిలుస్తోంది. సౌరశక్తి భారతదేశ పునరుత్పాదక ఇంధన మిశ్రమాన్ని వెన్నెముకగా మాత్రమే కాకుండా, సుస్థిర అర్థికాభివృద్ధి, ఇంధన భద్రత, వాతావరణ నాయకత్వానికి ఉత్ప్రేరకంగా మారింది. అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), ఓఎస్ఓడబ్ల్యూఓజీ వంటి కార్యక్రమాల ద్వారా భారీ స్థాయి విస్తరణను ప్రపంచ భాగస్వామ్యాలతో కలపడం ద్వారా సౌర శక్తి దేశీయ పరిష్కారంగానే కాకుండా ప్రపంచ స్వచ్ఛ ఇంధన పురోగతికి చోదకశక్తిగా భారత్ నిలుస్తోంది.
భారతదేశం తన సౌర సామర్థ్యాన్ని విస్తరించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సమ్మిళిత ప్రాప్యతను కల్పించడంతో పాటు ఒక దృఢమైన, తక్కువ-కర్బన భవిష్యత్తు వైపు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సౌర శక్తి కీలకంగా ఉంటుందని ప్రపంచానికి చాటుతోంది.
Press Information Bureau:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1809204
https://www.pib.gov.in/PressReleasePage.aspx/pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=2117501
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2144627
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2004187
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795071
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2041641
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2111106
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2156173
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110283
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2042069
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=155063&NoteId=155063&ModuleId=3
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1961797
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1795071
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=154717&id=154717
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2117501
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1763712
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/nov/doc2022119122601.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2183866
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2176518
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2183434
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1943779
Ministry Of New and Renewable Energy:
https://mnre.gov.in/en/policies-and-regulations/schemes-and-guidelines/schemes/
https://mnre.gov.in/en/wind-policy-and-guidelines/
https://missionlife-moefcc.nic.in/
https://mnre.gov.in/en/physical-progress/
https://mnre.gov.in/en/year-wise-achievement
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU491_lHmqAc.pdf
https://pmkusum.mnre.gov.in/#/landing
Ministry of Electronics & Information Technology
https://mnre.gov.in/en/national-green-hydrogen-mission
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2022-11/Mission_LiFE_Brochure.pdf
https://niti.gov.in/key-initiatives/life
Others
https://cdnbbsr.s3waas.gov.in/s3716e1b8c6cd17b771da77391355749f3/uploads/2025/09/2025091984030227.pdf
https://pmsuryaghar.gov.in/
See in PDF
***
(Explainer ID: 156399)
आगंतुक पटल : 91
Provide suggestions / comments