మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అతిపెద్ద ఆన్ లైన్ హాకథాన్ గ్రాండ్ ఫినాలే భాగస్వాములతో ప్రధాని మోదీ సంభాషణ

21వ శతాబ్దపు యువత ఆకాంక్షలకు ప్రతిరూపం జాతీయ విద్యావిధానం-2020: ప్రధాని

పరివర్తనాత్మక సంస్కరణలే లక్ష్యం; ఉద్యోగం అడిగేవాళ్ళకంటే ఇచ్చేవాళ్లను సృష్టించటం మీదనే దృష్టి: ప్రధాని

అంతకు ముందు స్మార్ట్ ఇండియా హాకథాన్- 2020 ని ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి

4.5 లక్షల విద్యార్థులు, 2 వేలకు పైగా విద్యాసంస్థలు పాల్గొన్న ప్రపంచపు అతిపెద్ద ఆవిష్కరణల నమూనా

Posted On: 01 AUG 2020 8:37PM by PIB Hyderabad

స్మార్ట్ ఇండియా హాకథాన్-2020 ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొనవారినుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.


స్మార్ట్ ఇండియా హాకథాన్


స్మార్ట్ ఇండియా హాకథాన్ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం ఎదుర్కుంటున్న అనేక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనే దిశగా విద్యార్థులు కృషి చేస్తున్నారని ప్రధాని అన్నారు. సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటంతో బాటుగా డేటా, డిజిటైజేషన్, హైటెక్ భవిష్యత్తు లాంటి అంశాలమీద భారత ఆకాంక్షలను కూడా అది వెల్లడిస్తుందన్నారు. వేగంగా పరుగులిడుతున్న 21వ శతాబ్దంలో సమర్థమైన పాత్ర పోషించేందుకు భారత్ కూడా వేగంగా మారాల్సిన అవసరాన్ని ఒప్పుకుంటూ, అందుకు తగిన వాతావ్వరణాన్ని కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా నవకల్పనలకు, పరిశోధనకు, అభివృద్ధికి, వ్యాపారనాయకత్వానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మొత్తంగా భారత విద్యావిధానాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్ది, ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించటమే లక్ష్యమన్నారు.
 

జాతీయ విద్యా విధానం
జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ, 21వ శతాబ్దపు యువత ఆలోచనలు, అవసరాలు, ఆశలు,  ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని రూపుదిద్దామన్నారు.  ఇది కేవలం విధానపత్రం కాదని, 130 కోట్లకి పైబడ్డ భారతీయుల  ఆకాంక్షలకు ప్రతిబింబమని అభివర్ణించారు. " ఈరోజుకూ పిల్లలు తమకు ఆసక్తి లేని అంశం మీద తమ శక్తిని అంచనావేస్తున్నారన్న ఆవేదనతో ఉన్నారు. తల్లిదండ్రుల, బంధుమిత్రుల వత్తిడి కారణంగా ఇతరులు ఎంచుకున్న అంశాలే ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా బాగా చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాళ్ళు చదువుకున్నదేదీ వాళ్ళకు పనికిరావటం లేదు. " అన్నారు. ఈ విధమైన ధోరణికి సమూలంగా మార్చి వేసి భారత విద్యావిధానంలో ఒక క్రమబద్ధమైన సంస్కరణ తీసుకురావటానికే కొత్త జాతీయ విద్యావిధానం ప్రయత్నిస్తోందన్నారు. ఈ మార్పు వలన విద్య పట్ల అభిప్రాయం, విద్యాంశాలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు.  అభ్యసనం, పరిశోధన, నవకల్పనల ఆవిష్కరణ మీద జాతీయ విద్యావిధానం దృష్టిసారిస్తుందని, దానివలన పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం విద్యార్థి సహజసిద్ధమైన ఆసక్తులమీద ఆధారపడి ప్రయోజనాత్మకంగా వ్యవహరిస్తాయని అన్నారు.
విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ఈ హాకథాన్ మీరు పరిష్కరించటానికి చేసిన తొలిప్రయత్నమూ కాదు, తుది ప్రయత్నమూ కాదు" అన్నారు. యువత "అభ్యసించటం, ప్రశ్నించటం, పరిష్కరించటం" అనే మూడు పనులు కొనసాగించాలన్నారు. చదువుకుంటే ప్రశ్నించే తెలివి వస్తుందని, భారత జాతీయ విద్యావిధానం ఈ స్ఫూర్తినే ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. స్కూలు బాగ్  బరువు మోయటం మీదనుంచి ధ్యాస మరలుతున్నదని, జీవితానికి సాయపడే అభ్యసనం అనే వరం కారణంగా బట్టీ పట్టటానికి బదులు తీవ్రంగా ఆలోచించటానికే మొగ్గు చూపుతుందన్నారు.
విద్యావకాశాల అందుబాటు
బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఉటంకిస్తూ, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని,  అందుకే ఈ విద్యావిధానం కూడా "అందుబాటులో ఉండేలా విద్య " అనే ఆయన ఆలోచనకే అంకితమన్నారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్య మొదలుకొని అందరికీ అందుబాటులో ఉండటం మీదనే దృష్టి పెట్టిందన్నారు. తొలి చదువులనుంచి ఉన్నత విద్యకు వచ్చేసరికి కనీసం 50 శాతం మంది ఉండేలా చూడటమే 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యమన్నారు. ఉద్యోగాలు కోరుకునేవాళ్లకంటే ఇచ్చేవాళ్లను తయారుచేయటానికే ఈ విద్యావిధానం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఆవిధంగా మన ఆలోచనా విధానంలోను, మన వైఖరిలోను మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. 
విశ్వ సమైక్యతకు ప్రాధాన్యం 
స్థానిక సమగ్రత మీద దృష్టిపెట్టినప్పటికీ ఈ విధానం ప్రపంచ సమగ్రతకు కూదా అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. పేరుమోసిన అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో తమ కాంపస్ లు ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివలన భారత యువతకు అంతర్జాతీయ స్థాయి అనుభవం, అవకాశాలు పొందే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్దారు. అదే సమయంలో అంతర్జాతీయ పోటీకి కూడా సిద్ధం కాగలరన్నారు.  భారత్ లో అంతర్జాతీయ స్థాయి సంస్థల నిర్మాణానికి ఇది దోహదం చేస్తుందని, అంతర్జాతీయ విద్యకు భారత్ ఒక హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 
స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 ని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగపు పూర్తి పాఠం కోసం క్లిక్ చేయండి
ఉదయం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’ స్మార్ట్ ఇండియా హాకథాన్ ( సాఫ్ట్ వేర్) 2020 నాలుగో ఎడిషన్ గ్రాండ్ ఫినాలే ను న్యూ ఢిల్లీలో వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే , ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, ఎఐసిటిఇ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధే, చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్ జెరె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హాకథాన్ ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఎఐ సిటిఇ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఐ4సి సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి.
ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ, ఈ ఏడాది తొలి రౌండ్ లోనే  అత్యద్భుతంగా 4.5 లక్షల మంది విద్యార్థులనుంచి స్పందన వచ్చిందని అన్నారు. దేశంలో డిజిటల్ తారతమ్యాన్ని పూడ్చటానికి డిజిటల్ ఇండియా కు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారన్నారు. డిజిటల్ అక్షరాస్యత ద్వారా అభివృద్ధిని ఒక సమగ్రమైన ప్రజా ఉద్యమంగా మార్చి పాలనను భారత్ లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలని చెప్పారన్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో డిజిటల్ ఇండియా ఫలాలను చూస్తున్నామన్నారు.
ఈ హాకథాన్ ప్రపంచంలోనే అతిపెద్ద నవకల్పనల నమూనా అని శ్రీ పోఖ్రియాల్ ప్రస్తావించారు. ఇందులో నాలుగున్నర లక్షలమందికి పైగా విద్యార్థులు, 2000కు పైగా విద్యాసంస్థలు, 1000కి పైగా మెంటార్లు, 1500కు పైగా న్యాయనిర్ణేతలు, కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సహా  70 కి పైగా సమస్యలు అందజేసిన ఏజెన్సీలు, ప్రైవేటు పరిశ్రమలు ఉండటం వల్ల నిజమైన పిపిపి మోడల్ అద్దం పట్టినట్టయిందన్నారు. ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే ఇలాంటి నమూనా ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కోసం నవకల్పన అనే సంస్కృతి గురించి  పోఖ్రియాల్ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మారథాన్ లో పాల్గొన్న వారు సూచించిన పరిష్కారమార్గాలు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటానికి ప్రధాని పిలుపునిచ్చిన " స్థానికతకోసం గొంతెత్తుదాం"  నినాదాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ఈ ఏడాది మొత్తం 10,000 మంది ఈ మారథాన్ లలో పాల్గొని 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 13 రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, 20 పరిశ్రమలు సూచించిన 243 సమస్యల పరిష్కారానికి పోటీ పడతారని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్క అంశానికీ లక్ష రూపాయల బహుమతి ఉంటుందని, విద్యార్థి నవ కల్పనల విభాగంలో రూ. లక్ష, రూ. 75 వేలు, రూ. 50 వేలు చొప్పున మూడు బహుమతులు ఉంటాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీ ధోత్రే మాట్లాడుతూ మనం నిత్యజీవితంలొ అనేక సమస్యలు ఎదుర్కుంటున్నామని, అందువల్ల సమస్యల పరిష్కారం కోసం కొత్త ఆవిష్కరణల అవసరం పెరుగుతూ వస్తున్నదన్నారు. ఆ కోణంలో యువత ఎక్కువగా ఆలోచించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు సంస్థాగతంగా ఏదాదిపొదవునా సాగాలన్నారు. సంస్థలు అనేక సమస్యల జాబితాతో ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, అప్పుడే విద్యార్థి తనకు ఆసక్తి కలిగించే ఒకదాన్ని ఎంచుకొని పనిచేయగలుగుతాడని అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే అటల్ టింకరింగ్ లాబ్ ల ద్వారా ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ లాబ్ లలో చేసిన నమూనాలను ఇలాంటి హాకథాన్ దాకా తీసుకు రావాలని పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాలను ఎదుర్కునేలా డ్రగ్ డిస్కవరీ హాకథాన్ కూడా సాగుతోందన్నారు.
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి  శ్రీ అమిత్ ఖరే మాట్లాడుతూ, స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 సాఫ్ట్ వేర్ విభాగం ఆన్ లైన్ వేదిక ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. విద్యావిధానం మొత్తం ఆన్ లైన్ బోధనామార్గాన్ని అనుసరిస్తోందన్నారు.  ఈ హాకథాన్ విజయానంతరం రెండు ప్రముఖ హాకథాన్ లు - భారత్-పోర్చుగల్ హాకథాన్, ఇండియా ఆసియాన్ హాకథాన్ జరగబోతున్నాయని  ఆయన వెల్లడించారు. స్థానికత నుంచి అంతర్జాతీయం దాకా ఎదుగుతున్నామనటానికి ఇవి నిజమైన సంకేతాలన్నారు. 
ఎఐసిటిఇ చైర్మన్ ప్రొఫెసర్ సహస్రబుద్ధి మాట్లాడుతూ, కొత్త జాతీయ విద్యావిధానం భారతదేశపు సుసంపన్నమైన పురాతన జ్ఞానాన్ని ప్రజలకు పంచటంలో సహాయపడుతుందన్నారు. సామాజిక శాస్త్రాల పరిశోధనను నేషనల్ రీసెర్చ్  ఫౌండేషన్  పరిధిలోకి తీసుకురావటం ఒక మంచి సంకేతమన్నారు. నవకల్పనల సంస్కృతి పెరగటానికి ఇది దోహదం చేస్తుందన్నారు. 
ఇప్పుడు దేశంలో మొదలైన ఈ హాకథాన్ సంస్కృతి ఇక మీదట చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తుందని  డాక్తర్ అభయ్ జెరె అభిప్రాయపడ్దారు. ఇప్పుడు చిన్నపట్టణాలతోబాటు స్థానిక సంస్థలు కూడా హాకథాన్ లు నిర్వహించటం ద్వారా యువతను ప్రోత్సహిస్తూ వారి ఆలోచనావిధానాన్ని పదును పెట్టటానికి, తమ పాలలను మెరుగుపరచుకోవటానికి వాడుతున్నారు. 


స్మార్ట్ ఇండియా హాకథాన్ లో ఇప్పటివరకూ 331 నమూనాలను అభివృద్ధి చేశారు. 71 స్టార్టప్ లు ఏర్పాటు దశలో ఉండగా, 19 స్టార్టప్ లు విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నాయి. 39 అంశాలు ఇప్పటికే వివిధ విభాగాలలో నియోగించారు. అవకాశమున్న మరో 64 నమూనాలకు మరింత అభివృద్ధి నిమిత్తం నిధులు సమకూర్చారు. స్టార్టప్ నవకల్పనల సంస్కృతిని పెంపొందించటంలో స్మార్ట్ ఇండియా హాకథాన్ సహాయపడుతోంది. 

 

***



(Release ID: 1643045) Visitor Counter : 253