యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

బెంగళూరు 'ఎన్‌సీవోఈ'లో కోలుకుంటున్న కరోనా పాజిటివ్‌గా తేలిన ఐదుగురు భారత హాకీ ఆటగాళ్లు క్రీడాకారులకు అత్యుత్తమ వైద్య సంరక్షణ

Posted On: 08 AUG 2020 6:00PM by PIB Hyderabad

ఈనెల 7వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలి, బెంగళూరులోని 'నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌' (ఎన్‌సీవోఈ)లో స్వీయ క్వారంటైన్‌లో ఉంటున్న ఐదుగురు భారత హాకీ ఆటగాళ్లు కోలుకుంటున్నారు. భారత క్రీడల అథారిటీ (సాయ్‌)కి చెందిన వైద్యుడితోపాటు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుడు డా.అవినాష్‌ ఆటగాళ్లకు ప్రతిరోజూ చికిత్స చేస్తున్నారు. మణిపాల్‌ ఆస్పత్రి నుంచి కూడా నిపుణుడైన వైద్యుడిని సాయ్‌ రప్పించింది. క్రీడాకారుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులను గమనిస్తున్నట్లు, వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు డా.అవినాష్‌ వెల్లడించారు. ఐదుగురిలో ఒకరు జ్వరంతో ఉన్నారని, రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్లను, ఔషధాలను అందరికీ ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుల శరీర లక్షణాలు సాధారణ స్థితికి చేరేంతవరకు ప్రొటోకాల్‌ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

    ఐదుగురు క్రీడాకారులను నిరంతరం పర్యవేక్షించడానికి, వారి అవసరాలు తీర్చడానికి ఇద్దరు అధికారులను సాయ్‌ నియమించింది. భారత పురుషుల హాకీ చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ మాట్లాడుతూ, తాను ఎప్పటికప్పుడు ఆ ఐదుగురు ఆటగాళ్లతో మాట్లాడుతున్నానని, వారంతా బాగానే ఉన్నారని చెప్పారు. వారికి ఉత్తమ సంరక్షణ అందించేందుకు అన్ని ఏర్పాట్లను సాయ్‌ చేసిందన్నారు. మెస్‌ మెనూ కాకుండా, క్రీడాకారులు కోరుకున్న ఆహారాన్ని అందిస్తున్నామని, దీనిపై వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

***
 



(Release ID: 1644441) Visitor Counter : 175