సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
‘ప్రజా పరిపాలనలో శ్రేష్ఠత్వ సాధనకు ప్రధానమంత్రి పురస్కారాలు-2025 పథకాన్ని’ ప్రకటించిన డీఏఆర్పీజీ
• 2025 సంవత్సరానికి, మూడు కేటగిరీల్లో 16 అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వోద్యోగుల తోడ్పాటును గుర్తించడం
• ‘ప్రజా పరిపాలనలో శ్రేష్ఠత్వ సాధన... ప్రధానమంత్రి ఇచ్చే పురస్కారాలు-2025 పథకం’ ఉద్దేశం
• కేటగిరీ, అవార్డుల వివరాలు:
ఒకటో కేటగిరీ..11 ప్రాధాన్య రంగ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాల సమగ్ర అభివృద్ధి (5 అవార్డులు)
రెండో కేటగిరీ.. ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం (5 అవార్డులు)
మూడో కేటగిరీ.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలతో పాటు జిల్లాల కోసం నవకల్పనలు (6 అవార్డులు)
Posted On:
01 JUL 2025 1:26PM by PIB Hyderabad
‘ప్రజా పరిపాలనలో శ్రేష్ఠత్వ సాధనకు ప్రధానమంత్రి పురస్కారాలు -2025 పథకాన్ని’ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, జిల్లాల కోసం పాలనాపరమైన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) ఈ రోజు నోటిఫై చేసింది.
2. ప్రధానమంత్రి పురస్కారాల కోసం నమోదు చేసుకోవడం, నామినేషన్లను దాఖలు చేయడం కోసం ఒక వెబ్ పోర్టల్ను లాంఛనంగా ఈ ఏడాది అక్టోబరు 2న ప్రారంభించనున్నారు. ఆ తరువాత నుంచి నామినేషన్లను దాఖలు చేయవచ్చు.
3. భారత్ సంపూర్ణాభివృద్ధి దిశగా చేపట్టే ప్రయత్నాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పురస్కారాల పథకాన్ని ప్రారంభించారు. సమగ్ర కార్యాచరణపై దృష్టిని కేంద్రీకరించడం దీని ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా సమాచార, రాతపూర్వక ఆధారాలను సమీకరించడం, సుపరిపాలనలతో పాటు నాణ్యత సంబంధిత అంశాలపై శ్రద్ధ తీసుకొన్నారు. ఈ పథకంలో 11 ప్రాధాన్య రంగ పథకాల అమలుపై ఉమ్మడి సమీక్షను నిర్వహిస్తారు.
4. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 సంవత్సరం నుంచి పీఎమ్ ఎక్స్లెన్స్ అవార్డుల భావన, స్వరూపం.. ఈ రెండిటిలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకొన్నాయి. సంఘటిత పోటీని, నవకల్పనను, అతి ఉత్తమ అభ్యాసాల అనుకరణ, సంస్థాగత ప్రణాళికలో భాగంగా ఆ అభ్యాసాలను సంధానించడాన్ని ప్రోత్సహించం ఈ పథకం ఉద్దేశాలు. ఈ దృష్టికోణంలో భాగంగా, పరిమాణం పరమైన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి బదులు సుపరిపాలన, గుణాత్మక కార్యసాధనకు తోడు వరుసలోని చివరి వ్యక్తికి కూడా లబ్ధిని విస్తరించడం.. వీటిపై శ్రద్ధ వహిస్తారు. లక్షిత వ్యక్తిగత లబ్ధిదారులు, అందరికీ లబ్ధిని సమకూర్చడం.. ఈ ప్రాతిపదికలతో జిల్లా కలెక్టర్ పనితీరును గుర్తించడం ఈ సంవత్సర పురస్కారాల పథకం ఉద్దేశంగా ఉంది. ఈ అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ, పురస్కారాల కోసం దరఖాస్తులను మూడు కొలమానాలతో మూల్యాంకనం చేయనున్నారు. ఆ మూడు కొలమానాలలో- సుపరిపాలన, రాశి, వాసి పరమైన కోణాల్లో చూస్తారు.
5. ‘ప్రజా పరిపాలనలో శ్రేష్ఠత్వ సాధనకు ప్రధానమంత్రి పురస్కారాలు -2025 పథకం’లో అన్ని జిల్లాలూ పాలుపంచుకొంటాయని భావిస్తున్నారు.
6. 2025 సంవత్సరానికి, మూడు కేటగిరీల్లో ప్రభుత్వోద్యోగుల తోడ్పాటుకు గుర్తింపును ఇవ్వాలనేది ప్రజా పరిపాలనలో శ్రేష్ఠత్వ సాధనకు ప్రధానమంత్రి పురస్కారాలు -2025 పథకం’ ఉద్దేశం. ఆ మూడు కేటగిరీల్లో :
-
కేటగిరీ 1: 11 ప్రాధాన్య రంగ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాల సమగ్ర అభివృద్ధి. 5 అవార్డులు ఇస్తారు.
-
కేటగిరీ 2: ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం. ఇందులో 5 అవార్డులు ఇస్తారు.
-
కేటగిరీ 3: కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలతో పాటు జిల్లాల కోసం నవకల్పన. 6 అవార్డులు ఇస్తారు.
7. ఒకటో కేటగిరీ (జిల్లాల సమగ్రాభివృద్ధి) కోసం పరిశీలన కాలం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 సెప్టెంబరు 30 వరకు లెక్కలోకి తీసుకొంటారు.
రెండో కేటగిరీ (ఆకాంక్షాత్మక) తో పాటు మూడో కేటగిరీ (నవకల్పనల) కోసం పరిశీలన కాలం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 సెప్టెంబరు 30 వరకు ఉంటుంది.
8. మూల్యాంకన ప్రక్రియలో (i) స్క్రీనింగ్ కమిటీ ద్వారా (ప్రథమ, ద్వితీయ దశలకు) తుది పరిశీలనకు జిల్లాలు లేదా సంస్థల ఎంపిక, (ii) నిపుణుల కమిటీ ద్వారా మూల్యాంకనంతో పాటు (iii) సాధికార కమిటీ.. ఇవి భాగంగా ఉంటాయి. పురస్కారాల కోసం ఏర్పాటు చేసిన సాధికార కమిటీ సిఫారసులు ప్రధానమంత్రి ఆమోదానికి లోబడి ఉంటాయి.
9. ప్రధానమంత్రి పురస్కారాలు-2025లో (i) ట్రోఫీ (ii) ప్రశంసాపత్రం (iii) పురస్కారాన్ని అందుకొనే జిల్లాకు లేదా సంస్థకు రూ.20 లక్షలు అందిస్తారు. ఈ మొత్తాన్ని ప్రాజెక్టు లేదా కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఉపయోగించడంగాని, లేదా ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రంగంలో వనరుల లోటును తీర్చడానికిగానీ వినియోగించాల్సి ఉంటుంది.
***
(Release ID: 2141198)