రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వన్ యాప్ ప్రారంభం : ప్రయాణికుల సేవలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం
Posted On:
01 JUL 2025 3:19PM by PIB Hyderabad
ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వే శాఖ నిరంతం కృషి చేస్తున్నది. కొత్త తరానికి చెందిన రైళ్లను ప్రవేశపెట్టడం, స్టేషన్లకు మెరుగులు దిద్దడం, పాత రైలుపెట్టెలను కొత్త ఎల్హెచ్బీ రైలుపెట్టెలుగా మార్చడంతో పాటు అలాంటి మరెన్నో చర్యలను గత పది సంవత్సరాల్లో ప్రయాణికులకు చక్కని అనుభూతులను పంచుతోంది.
ఈ రోజు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) 40వ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఒక కొత్త యాప్ను కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రారంభించారు. ఈ యాప్ పేరు ‘రైల్వన్’ (RailOne). రైల్వేలతో ప్రయాణికుల సంబంధాలను మరింతగా చక్కదిద్దడంపై రైల్వన్ తన దృష్టిని కేంద్రీకరిస్తుంది.
ఇది ఒక విస్తృత, ఆల్-ఇన్-వన్ అప్లికేషన్.. దీనిలో వినియోగదారుకు అనుకూలంగా ఉండే ఇంటర్ఫేస్ను ఇచ్చారు. యాండ్రాయిడ్ ప్లే స్టోర్ (Android Play Store) లోనూ, ఐఓఎస్ యాప్ స్టోర్ (iOS App Store)లోనూ అందుబాటు ఉన్న ఈ యాప్ ప్రయాణికుల సేవలనన్నింటినీ ఒకే చోటుకు తెస్తుంది. ఇందులోని కొన్ని సేవలు:
● అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లపై 3 శాతం డిస్కౌంటు
● లైవ్ ట్రయిన్ ట్రాకింగ్
● ఫిర్యాదుల పరిష్కారం
● ఇ-కేటరింగ్, పోర్టర్ బుకింగ్, లాస్ట్-మైల్ ట్యాక్సీ.
రిజర్వ్డ్ టికెట్లను ఐఆర్సీటీసీ లో అందుబాటులో ఉంచుతారు. ఐఆర్సీటీసీ తో భాగస్వామ్యం పంచుకొన్న అనేక ఇతర వాణిజ్య సరళి యాప్ల తరహాలోనే రైల్వన్ యాప్ సేవల్ని అందిస్తుంది.
రైల్వన్లో సింగిల్ సైన్-ఆన్ సదుపాయం ఉంది. దీనిలో ఎంపిన్ (mPIN) లేదా బయోమెట్రిక్ను ఉపయోగించి లాగిన్ కావొచ్చు. ఇది ఇప్పటి రైల్కనెక్ట్ (RailConnect), ఇంకా యూటీఎస్ క్రెడెన్షియల్స్ను కూడా సపోర్ట్ చేస్తుంది. అనేక యాప్లను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ యాప్ మొబైల్లో స్పేస్ ను ఆదా చేస్తుంది.
2025 డిసెంబరు కల్లా ఆధునిక ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్)
సీఆర్ఐఎస్ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా సీఆర్ఐఎస్ బృందానికి రైల్వే మంత్రి అభినందనలు తెలిపారు. భారతీయ రైల్వేలలో డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిందిగా ఆయన కోరారు.
ఇప్పటి పీఆర్ఎస్ను ఉన్నతీకరించడంలో సాధ్యపడ్డ ప్రగతి విషయంలో కూడా సీఆర్ఐఎస్ నిపుణుల బృందాన్ని మంత్రి అభినందించారు. ఆధునిక పీఆర్ఎస్ వేగవంతంగాను, అనేక భాషలలోను, ఇప్పటి పనిభారం కన్నా 10 రెట్ల అధిక భారాన్ని నిర్వహించడానికి తగినదిగాను ఉంటుంది. ఇది 1.5 లక్షల టికెట్లను బుక్ చేయగలుగుతుంది. ఇది నిమిషానికి 40 లక్షల విచారణలకు సహకరించగలదు.
కొత్త పీఆర్ఎస్ అందరినీ కలుపుకొని పోయేదిగా ఉంటుంది. దీనిలో సీటు ఎంపిక, టిక్కెట్ ధరల క్యాలెండరు కోసం ఉన్నత సౌకర్యాలు, దివ్యాంగజనులు, విద్యార్థులు, రోగుల వంటి వారి కోసం సమీకృత ఐచ్ఛికాలు ఉంటాయి.
భవిష్యత్తుకు నిర్వచనం చెప్పే టెక్నాలజీ
భారతదేశ ప్రగతి యాత్రకు ఒక ఇంజిన్లా భారతీయ రైల్వేలను తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణాన్ని అనుసరిస్తూ రైల్వే శాఖ పయనిస్తున్నది. టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించడంతో పాటు ప్రపంచ స్థాయి రాకపోకల సదుపాయాన్ని ప్రయాణికులందరికీ అందజేయాలన్న భారతీయ రైల్ నిబద్ధతను రైల్వన్ యాప్ పునరుద్ఘాటిస్తోంది.
***
(Release ID: 2141266)
Read this release in:
Odia
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam