రాష్ట్రపతి సచివాలయం
స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము సంప్రదాయ జీవన విధానాలను నుంచి నేర్చుకున్న అంశాలతో ఆధునిక పునర్వినియోగ వ్యవస్థలు సుసంపన్నం: రాష్ట్రపతి
Posted On:
17 JUL 2025 1:58PM by PIB Hyderabad
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈరోజు (2025, జులై 17) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలను ప్రదానం చేశారు.
పరిశుభ్రత నెలకొల్పేందుకు నగరాలు చేస్తున్న కృషిని అంచనా వేసేందుకు, ప్రయత్నాలని ప్రోత్సహించేందుకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ చక్కని అభ్యాసంగా నిలిచిందని రాష్ట్రపతి అన్నారు. సుమారు 14 కోట్ల మంది పౌరులు, రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలు సహా వివిధ భాగస్వాములు పాల్గొన్న 2024 పరిశుభ్రత సర్వేను గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టడం తనకు సంతోషాన్ని కలిగించిందనీ, ఈ సర్వే ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచిందని రాష్ట్రపతి చెప్పారు.
పురాతన కాలం నుంచి మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం పరిశుభ్రతకు ఎంతో విలువనిచ్చిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇళ్ళు, ప్రార్థనా స్థలాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం భారతీయుల జీవన శైలిలో భాగమని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పరిశుభ్రతను ఈశ్వరుని రూపంగా భావించేవారని గుర్తు చేశారు. మతం, ఆధ్యాత్మికత, సామాజిక జీవనానికి పరిశుభ్రత పునాది వంటిదని బాపూజీ భావించేవారన్నారు. పరిశుభ్రతకు సంబంధించిన పనితోనే తాను ప్రజాజీవితాన్ని ప్రారంభించినట్లు శ్రీమతి ముర్ము చెప్పారు. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఉపాధ్యక్షురాలి హోదాలో తాను ప్రతిరోజూ వార్డులను సందర్శించి, పరిశుభ్రత కార్యకలాపాలని స్వయంగా పర్యవేక్షించడాన్ని గుర్తు చేసుకున్నారు.
వనరులను పరిమితంగా వాడటం.. అదే పనికి కానీ, వేరే పనికి కానీ అదే వనరుని తిరిగి ఉపయోగించడం, తద్వారా వ్యర్థాలను నివారించడం మన జీవన విధానంలో భాగమని శ్రీమతి ముర్ము అన్నారు. నేటి ఆధునిక పునరుపయోగ వ్యవస్థ సిద్ధాంతాలు, రెడ్యూస్- రీయూజ్- రీసైకిల్ నినాదాలు ఒకనాటి జీవన విధానాన్ని ప్రతిబింబించేవేనని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఉదాహరణగా గిరిజన సమూహాల జీవన విధానాన్ని గురించి చెబుతూ, వారు సాదాజీవితాన్ని గడుపుతారని, వనరులని మితంగా వినియోగించుకుంటూ ఇతర సమూహాల భాగస్వామ్యంతో వాతావరణం, పర్యావరణాలకు అనుకూలంగా జీవిస్తారని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల విలువ గుర్తెరిగి, వాటిని వ్యర్థం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, వారి ప్రవర్తన, పద్ధతుల నుంచి ఆధునిక సమాజం పాఠాలు నేర్చుకుని పునరుపయోగ వ్యవస్థలను సుసంపన్నం చేసుకోవచ్చునని సూచించారు.
వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో అన్నిటికన్నా కీలకమైన మొదటి అడుగు సోర్స్ సెగ్రిగేషన్ – లేదా వ్యర్థాలను తడి,పొడి వంటి విభాగాల కింద విభజించడమని చెప్పారు. ఈ రంగంతో సంబంధమున్న వారందరూ, ప్రతి కుటుంబం దీనికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని రాష్ట్రపతి ఉద్బోధించారు. జీరో-వేస్ట్ కాలనీలు ఇందుకు చక్కని ఉదాహరణలుగా నిలుస్తున్నాయన్నారు.
విద్యార్థులు పరిశుభ్రతను జీవిత విలువగా స్వీకరించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పాఠశాల స్థాయి మూల్యాంకన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. చక్కని ఫలితాలను చూపే ఈ కార్యక్రమం దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటుందని శ్రీమతి ముర్ము అభిప్రాయపడ్డారు.
ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, వాటి ద్వారా పర్యావరణకు కలిగే హానిని నియంత్రించడం పెద్ద సవాలుగా నిలుస్తోందని రాష్ట్రపతి అన్నారు. అయితే, సరైన దిశలో చేసే ప్రయత్నాల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2022లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కొన్నింటి వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అదే సంవత్సరంలో ప్లాస్టిక్ ప్యాకేజీకి సంబంధించి తయారీదారులకు ‘ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ పేరిట కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పారు. ఆయా మార్గదర్శకాలను సంపూర్ణంగా పాటించే బాధ్యత తయారీదారులు, బ్రాండ్ల సొంతదారులు, దిగుమతిదారులు సహా భాగస్వాములందరికీ ఉంటుందని చెప్పారు.
పరిశుభ్రతకు సంబంధించి చేపట్టే కృషిలో ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక పార్శ్వాలు ఉంటాయని రాష్ట్రపతి అన్నారు. ప్రజలందరూ అంకితభావంతో స్వచ్ఛ్ భారత్ మిషన్ లో పాల్గొంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2047 నాటికి పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన భారతదేశం, చక్కని వ్యూహాలు, బలమైన సంకల్పాల సాయంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశాలలో ఒకటిగా నిలువగలదని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
***
(Release ID: 2145513)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam