రక్షణ మంత్రిత్వ శాఖ
ఎవరెస్టు, కిలిమంజారో పర్వతారోహణ బృందాలకు లాంఛనంగా స్వాగతం పలికిన రక్షణ శాఖ కార్యదర్శి
प्रविष्टि तिथि:
17 JUL 2025 1:21PM by PIB Hyderabad
ఎవరెస్టు, కిలిమంజారో పర్వతారోహణను విజయవంతంగా ముగించిన సాహస యాత్రికులకు జూలై 17న న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ లాంఛనంగా స్వాగతం పలికారు. ఉత్తరాఖండ్ ఉత్తర కాశీలోని నెహ్రూ పర్వతారోహణ సంస్థ (ఎన్ఐఎం)ను స్థాపించి 60 ఏళ్లయిన సందర్భంగా ఎవరెస్టు శిఖరారోహణ చేపట్టారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లోని హిమాలయన్ పర్వతారోహణ సంస్థ (హెచ్ఎంఐ), జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని జవహర్ పర్వతారోహణ, శీతాకాల క్రీడల సంస్థ (జేఐఎం- డబ్ల్యూఎస్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆఫ్రికాలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఆరోహణ యాత్రను హెచ్ఎంఐ నిర్వహించగా.. దివ్యాంగుడైన శ్రీ ఉదయ్ కుమార్ కూడిన బృందం ఈ యాత్రను చేపట్టింది. మోకాలికి పైభాగం వరకు 91 శాతానికి పైగా వైకల్యం ఉన్న ఆయన ఈ ఘనతను సాధించడం విశేషం.
ఇరుబృందాల అచంచల స్ఫూర్తి, దృఢ సంకల్పం, ధైర్యసాహసాలను రక్షణ కార్యదర్శి కొనియాడారు. ఇవి కేవలం పర్వతారోహణలు మాత్రమే కావన్న ఆయన.. సాహస క్రీడా కార్యకలాపాల్లో భారత పర్వతారోహణ నైపుణ్యాన్ని చాటుతూ దేశాన్ని ముందంజలో నిలుపుతున్నాయని అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని, కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన రెండు బృందాలు.. సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ పర్వతారోహకులకు స్ఫూర్తిగా నిలిచాయని వ్యాఖ్యానించారు.
యువత సాధికారత, స్వావలంబన, సాహసం... వీటివల్లే పటిష్టమైన, దృఢతరమైన, వెనుకడుగు వేయని భారత్ సాకారమవుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలంగా విశ్వసిస్తారని శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు పర్వతారోహణ సంస్థలు - హెచ్ఎంఐ, ఎన్ఐఎం, జేఐఎం- డబ్ల్యూఎస్, జాతీయ పర్వతారోహణ, సాహస క్రీడల సంస్థ (ఎన్ఐఎంఏఎస్) ఈ లక్ష్యానికి అద్భుతమైన ఉదాహరణలుగా అభివర్ణించారు.
ఎవరెస్టు శిఖరాధిరోహణ
ఈ యాత్రకు ఎన్ఐఎం ప్రిన్సిపాల్ కల్నల్ అన్షుమన్ భదౌరియా నేతృత్వం వహించారు. కల్నల్ హేమచంద్ర సింగ్ (డిప్యూటీ లీడర్), మూడు సంస్థలకు చెందిన అధ్యాపకులు- శ్రీ రాకేశ్ సింగ్ రాణా, సుబేదార్ బహదూర్ పహాన్, హవల్దార్ రాజేంద్ర ముఖియా, నాయక్ తుస్తాన్ సెవాంగ్, శ్రీ పసాంగ్ టెన్సింగ్ షెర్పా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

ఖుంబు లోయ గుండా ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని మే 23న ఈ బృందం అధిరోహించింది. శిక్షకులకు ప్రత్యక్షానుభవాన్నివ్వడంతోపాటు భావి పర్వతారోహకుల్లో స్ఫూర్తిని నింపి సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఈ యాత్ర లక్ష్యం.
కిలిమంజారో పర్వతారోహణ
ఈ యాత్రకు డార్జిలింగ్ గ్రూప్ హెచ్ఎంఐ ప్రిన్సిపాల్ కెప్టెన్ జై కిషన్ నేతృత్వం వహించారు. కెప్టెన్ శ్రుతి, సుబేదార్ మహేంద్ర కుమార్ యాదవ్, శ్రీ పావెల్ శర్మ, శ్రీమతి సులక్షణా తమాంగ్ ఈ బృందంలో సభ్యులు.

2024 ఆగస్టు 8న కిలిమంజారో పర్వతంపై అతిపెద్ద జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ బృందం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అనంతరం టాంజానియాలోని దార్ ఎస్ సలాం వద్ద హిందూ మహాసముద్రంలో 35 అడుగుల లోతులో నీటి అడుగున జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. తర్వాత ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా దివ్యాంగుల బృందం సమష్టిగా స్కైడైవ్ నిర్వహించింది. చేరుకోలేని ప్రాంతమంటూ ఏదీ లేదన్నట్లుగా... భూమిపైనా, నీటిలో, గాల్లో అన్నింటా సరికొత్త విజయాలను ఈ సాహసయాత్ర సాధించింది.
***
(रिलीज़ आईडी: 2145531)