ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని యావత్మల్లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
28 FEB 2024 8:37PM by PIB Hyderabad
జై భవానీ, జై భవానీ, జై సేవాలాల్! జై బిర్సా!
అందరికీ శుభాకాంక్షలు!
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులందరికీ స్వాగతం. ఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మన రైతు సోదరీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నేను వారిని కూడా స్వాగతిస్తున్నాను.
సోదరీ సోదరులారా,
ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించిన ఈ పవిత్ర భూమికి నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మహారాష్ట్ర పుత్రుడు, దేశానికే గర్వకారణం అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికీ నేను నివాళులర్పిస్తున్నాను. యావత్మల్-వాషిమ్ ప్రాంతంలోని ధైర్యవంతులైన బంజారా సోదరీ సోదరులకు రామ్ రామ్.
మిత్రులారా,
10 సంవత్సరాల కిందట "చాయ్ పర్ చర్చా" కార్యక్రమం కోసం నేను యావత్మల్ వచ్చినప్పుడు మీరు నన్ను సమృద్ధిగా ఆశీర్వదించారు. దేశ ప్రజలు ఎన్డీఏకు 300కి పైగా సీట్లు ఇచ్చారు. తరువాత నేను 2019 ఫిబ్రవరి నెలలో మళ్ళీ యావత్మల్ను సందర్శించాను. మరోసారి మీరు మాపై ప్రేమను కురిపించారు.. ఎన్డీఏకు 350కి పైగా సీట్లు లభించాయి. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందూ నేను అభివృద్ధి వేడుకలో పాలుపంచుకుంటున్నప్పుడు దేశమంతటా ఒకే నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఈసారి... 400 (సీట్లు)కు మించి, ఈసారి, 400 (సీట్లు)కు మించి... ఈసారి... 400 (సీట్లు)కు మించి! నన్ను ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన తల్లులు, ఆడపడుచులను నా ముందు చూస్తున్నాను. జీవితంలో ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? ఈ గ్రామాల తల్లులు, ఆడపడుచులకు నేను ప్రత్యేకంగా నా గౌరవపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యావత్మల్, వాషిమ్, చంద్రాపూర్, విదర్భ ప్రాంతాల నుంచి వచ్చిన అపారమైన ఆశీర్వాదాలు మా విజయాన్ని ముందే నిర్ణయించాయి... ఎన్డీఏ ప్రభుత్వం... 400 (సీట్లు)కు మించి! ఎన్డీఏ ప్రభుత్వం... 400 (సీట్లు)కు మించి!
మిత్రులారా,
ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు ఆదర్శం. ఆయన పాలన 350 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయన పట్టాభిషేకం చేసిన సమయంలో ఆయనకు అన్నీ అందుబాటులో ఉండేవి. ఆయన ఆ అధికారాన్ని హాయిగా అనుభవించగలిగేవారు. అయినా ఆయన ఎప్పుడూ అధికారంలో మునిగిపోలేదు. ఆయన దేశ చైతన్యాన్ని, శక్తిని అత్యున్నతంగా భావించారు. ఆయన జీవించినంత కాలం ఈ లక్ష్యం కోసమే పనిచేశారు. ఆయనలాగే మేం కూడా దేశాన్ని నిర్మించడం, పౌరుల జీవితాలను మార్చే లక్ష్యంతో బయలుదేరాం. గత 10 సంవత్సరాల్లో మేం చేసింది రాబోయే 25 సంవత్సరాలకు పునాది. దేశంలోని ప్రతి మూలనూ అభివృద్ధి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. ఈ నిబద్ధతలో విజయం కోసం నా శరీరంలోని ప్రతి కణం.. నా జీవితంలోని ప్రతి క్షణం.. మీ అందరి సేవకు అంకితం చేశాం. భారత్ను అభివృద్ధి చేయడానికి పేదలు, రైతులు, యువత, మహిళా సాధికారత నాలుగు ప్రధాన ప్రాధాన్యాలు. ఈ నలుగురికి అధికారం లభిస్తే దేశంలోని ప్రతి సమాజం, ప్రతి తరగతి, ప్రతి కుటుంబం సాధికారత పొందుతాయి.
మిత్రులారా,
ఈ రోజు యావత్మల్లో పేదలు, రైతులు, యువత, మహిళలను శక్తిమంతం చేయడానికి గణనీయమైన కృషి జరిగింది. మహారాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు వాటిని జాతికి అంకితం చేశాం. ఈ రోజు రైతులు నీటిపారుదల సౌకర్యాలను పొందుతున్నారు.. పేదలకు పక్కా ఇళ్ళు లభిస్తున్నాయి.. గ్రామాల్లోని నా ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందుతోంది.. యువత భవిష్యత్తును రూపొందించే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం. విదర్భ-మరాఠ్వాడ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, కొత్త రైళ్లను ప్రారంభించడం లక్ష్యంగా పలు ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ విజయాలన్నింటి కోసం మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
కేంద్రంలో ఇండీ కూటమి అధికారంలో ఉన్నప్పటి పరిస్థితిని గుర్తు చేసుకోండి. ఆ సమయంలో వ్యవసాయ మంత్రి మహారాష్ట్రకు చెందినవారే. అప్పట్లో ఢిల్లీ నుంచి విదర్భ రైతులకు ప్యాకేజీలు ప్రకటించారు.. అయితే మధ్యలోనే ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయి. గ్రామాలు, పేదలు, రైతులు, గిరిజన వర్గాలకు ఏమీ అందలేదు. నేటి దృశ్యాన్ని చూడండి.. నేను ఒక బటన్ నొక్కిన కొద్దిసేపటిలోనే పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాలకు చేరాయి. 21,000 కోట్ల రూపాయలు చిన్న సంఖ్య కాదు. ఇది మోదీ హామీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి మంజూరైన ప్రతి 1 రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరాయి. నేడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు అందుకున్న 21,000 కోట్లలో 18,000 కోట్లు మధ్యలోనే దుర్వినియోగం అయ్యేవి. భాజపా ప్రభుత్వంలో పేదల ప్రతి పైసా వారికే చేరుతుంది. ఇది మోదీ హామీ. ప్రతి లబ్ధిదారునికి వారి పూర్తి హక్కు లభిస్తుంది.. ప్రతి పైసా వారి బ్యాంకు ఖాతాలోకే వెళుతుంది.
మిత్రులారా,
మహారాష్ట్ర రైతులకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డబుల్ గ్యారెంటీ ఉంది. ఇటీవల మహారాష్ట్ర రైతులకు అదనంగా 3800 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. అంటే మహారాష్ట్ర రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా 12,000 రూపాయలు అందుకుంటున్నారు.
మిత్రులారా,
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 3 లక్షల కోట్లకు పైగా జమ అయ్యాయి. దీని ఫలితంగా మహారాష్ట్ర రైతులకు 30,000 కోట్లు, యావత్మల్ రైతులకు 900 కోట్లు వచ్చాయి. ఈ డబ్బు చిన్న రైతులకు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో ఊహించుకోండి. కొన్ని రోజుల కిందటే మా ప్రభుత్వం చెరకు గిట్టుబాటు ధరను రికార్డు స్థాయిలో పెంచింది. ఇప్పుడు చెరకు గిట్టుబాటు ధర క్వింటాలుకు 340 రూపాయలు. ఇది మహారాష్ట్రలోని లక్షలాది మంది చెరకు రైతులకు, క్షేత్రస్థాయి కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొద్ది రోజుల కిందట మన గ్రామాల్లో ధాన్యం నిల్వ గిడ్డంగులను నిర్మించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికను ప్రారంభించాం. ఈ గిడ్డంగులను మన రైతు సహకార సంఘాలే నిర్వహిస్తాయి. ఇది ముఖ్యంగా చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఇకమీదట ఉండదు.
స్నేహితులారా,
‘వికసిత్ భారత్’ సాధించడానికి బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కీలకం. అందుకే గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడానికి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు గత పదేళ్లుగా మేం నిరంతరం కృషి చేస్తున్నాం. నీటి ప్రాధాన్యం గురించి విదర్భ కంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుసు? అది తాగునీరైనా, సాగునీరైనా.. 2014కు ముందు దేశంలోని గ్రామాల్లో సంక్షోభం ఉండేది. అయితే అప్పటి ఇండీ కూటమి ప్రభుత్వానికి దీని గురించి పట్టించుకొనేందుకు సమయం దొరకలేదు. ఒక్కసారి ఆలోచించండి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 100 కుటుంబాల్లో 15 కుటుంబాలకు మాత్రమే నీటి కుళాయి వసతి ఉండేది. ఫలితంగా, పేదలు, దళితులు, వెనబడిన వర్గాలు, గిరిజన కుటుంబాల్లో ఎక్కువ భాగం ప్రయోజనాలకు దూరంగా ఉండేవి. ఇది మన తల్లులు, ఆడపడుచులకు పెద్ద కష్టంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, దీని నుంచి వారికి ఉపశమనం కల్పించడానికే ఎర్ర కోట నుంచి ‘హర్ ఘర్ జల్’ (ఇంటింటికీ నీరు) హామీని మోదీ ఇచ్చారు. అప్పటి నుంచి నాలుగైదేళ్ల వ్యవధిలోనే ప్రతి 100లో 75 గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సదుపాయం కల్పించాం. మహారాష్ట్రలో కూడా 50 లక్షల కంటే తక్కువ కుటుంబాలకే పైపుల ద్వారా నీరు అందేది. ఇప్పుడు సుమారుగా 1.25 కోట్ల కుటుంబాలకు కుళాయి నీరు అందుతోంది. అందుకే మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలవుతుందని దేశం చెబుతోంది.
స్నేహితులారా,
ఈ దేశ రైతులకు మోదీ మరో హామీ ఇచ్చారు. 100కు పైగా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే వదిలేశాయి. ఇప్పుడు వాటిలో 60 పూర్తవగా మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయి. నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 26 ఉన్నాయి. ఎవరు చేసిన పాపాల ఫలితాన్ని తరాల తరబడి భరించాల్సి వచ్చిందో మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భలో ఉన్న ప్రతి వ్యవసాయ కుటుంబానికి తెలుసుకొనే హక్కు ఉంది. నిలిచిపోయిన ఈ 26 ప్రాజెక్టుల్లో 12 పూర్తవగా.. మిగిలిన వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. 50 ఏళ్ల తర్వాత నీల్వాండే డ్యామ్ ప్రాజెక్టును పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వమే. కృష్ణ కొయినా ఎత్తిపోతల పథకం, టెంభు ఎత్తిపోతల పథకం కూడా దశాబ్దాల అనంతరం పూర్తయ్యాయి. గోసిఖుర్డ్ ప్రాజెక్టులో ఎక్కువ భాగం పని మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో పీఎం కృషి సించాయి, బలిరాజా జల సంజీవని పథకాల పరిధిలో 51 ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించుకున్నాం. ఇవి 80,000 హెక్టార్లకు పైగా భూమిని ఈ ప్రాజెక్టులు సస్యశ్యామలం చేస్తాయి.
స్నేహితులారా,
గ్రామాల్లోని మహిళలను ‘లఖ్పతీ దీదీ’లుగా మారుస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దేశంలో కోటి మంది ఆడపడుచులు ‘లఖ్పతీ దీదీ’లుగా ఎదిగారు. ఈ ఏడాది బడ్జెట్లో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను ‘లక్షాధికారి సోదరి’గా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించాం. దీనిని సాధించేందుకు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య 10 కోట్లు దాటింది. వీరికి బ్యాంకుల నుంచి రూ.8 లక్షల కోట్లు అందాయి. దీంతో పాటు రూ.40,000 కోట్ల ప్రత్యేక నిధులను కేంద్రం కేటాయించింది. మహారాష్ట్రలో పొదుపు సంఘాల సభ్యులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరింది. ఈ సంఘాలకు నేడు రూ.800 కోట్లకు పైగా సాయం అందుతోంది. యవత్మల్ జిల్లాలోని మహిళలకు ఈ-రిక్షాలు అందించాం. ఈ కార్యక్రమం చేపట్టిన షిండే జీ, దేవేంద్ర జీ, అజిత్ దాదా, మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
స్నేహితులారా,
మన ఆడపడుచులు ఇప్పుడు ఈ-రిక్షాలు నడుపుతున్నారు.. త్వరలో వారు డ్రోన్లను ఎగరవేస్తారు. నమో దీదీ డ్రోన్ పథకం పరిధిలో డ్రోన్ పైలట్లుగా మహిళా బృందాలకు శిక్షణ ఇస్తున్నాం. అనంతరం వారికి ప్రభుత్వం డ్రోన్లను అందిస్తుంది. వీటిని వ్యవసాయంలో ఉపయోగిస్తారు.
స్నేహితులారా,
ఈ రోజు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అంత్యోదయ (అణగారిన వర్గాల అభ్యున్నతి)కు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి పండిట్జీనే. పేదల సంక్షేమానికే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. పండిట్ జీ ఆలోచనల నుంచి మనం స్ఫూర్తి పొందాలి. గడచిన పదేళ్లుగా మేం పేదల సంక్షేమానికే కట్టుబడి ఉన్నాం. మొదటిసారిగా, ఉచిత రేషన్ అందించే హామీ ఇచ్చాం. మొదటిసారి ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఒక కోటి కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డులను అందించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. మొదటిసారిగా, మిలియన్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాం. ఈ రోజు, ఓబీసీ కుటుంబాలకు ఇళ్లు నిర్మించే ప్రత్యేక పథకం కూడా ప్రారంభమైంది. ఈ పథకం కింద ఓబీసీ కుటుంబాలకు 10 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తాం.
స్నేహితులారా,
గతంలో ఎవరూ పట్టించుకోనివారి పట్ల మోదీ శ్రద్ధ వహిస్తున్నారు. విశ్వకర్మ, బలుతేదార్ల కోసం ఏనాడు ఏ పథకం రూపొందించలేదు. మొదటి సారిగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని రూ.13,000 కోట్ల బడ్జెట్తో మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. గిరిజనుల్లోనే అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారి పట్ల మోదీ దృష్టి సారించారు. వారి అభివృద్ధి కోసం తొలిసారిగా రూ.23,000 కోట్ల వ్యయంతో పీఎం జన్మన్ యోజన ప్రారంభించాం. ఈ పథకం మహారాష్ట్రలోని కట్కారి, కోలం, మడియా లాంటి గిరిజన తెగలకు మెరుగైన జీవితాన్ని అందిస్తుంది. పేదలు, రైతులు, యువత, మహిళలకు ఈ కార్యక్రమం సాధికారత కల్పిస్తుంది. రానున్న అయిదేళ్లలో మరింత వేగవంతమైన అభివృద్ధిని మనం చూస్తాం. విదర్భలో ప్రతి కుటుంబం వచ్చే అయిదేళ్లలో అభివృద్ధి చెందుతుంది. మరోసారి, రైతు కుటుంబాలతో పాటు అందరికీ శుభాకాంక్షలు. నాతో కలసి చెప్పండి:
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
(Release ID: 2173389)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam