|
ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం
· దీంతో భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్ సుమారు 901 కిలోమీటర్ల మేర విస్తరణ · మొత్తం రూ.23,437 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 7:14PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇవాళ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో రూ.23,437 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో:
ఎ) నాగ్దా - మధుర 3వ, 4వ లైన్
బి) గుంతకల్ - వాడి 3వ, 4వ లైన్
సి) బుధ్వాల్ - సీతాపూర్ 3వ, 4వ లైన్
ఈ మార్గాల్లో లైన్ల సామర్థ్యం పెరుగుదల ద్వారా రవాణా సౌలభ్యంగా గణనీయంగా మెరుగవుతుంది. దీంతోపాటు భారతీయ రైల్వే కార్యాచరణ సామర్థ్యం, సేవా ప్రదానంలో విశ్వసనీయత ఇనుమడిస్తాయి. కార్యకలాపాల క్రమబద్ధీకరణ, రద్దీ తగ్గింపు లక్ష్యంగా ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘నవ భారత్’ దార్శనికతకు అనుగుణంగా ఇవి రూపొందుతున్నాయి. ఈ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ద్వారా అక్కడి ప్రజలను ‘స్వయంసమృద్ధం’ చేయడం ద్వారా వారి ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
సమగ్ర ప్రణాళిక, భాగస్వాములతో సంప్రదింపుల ద్వారా బహుళ రవాణా సాధనాల అనుసంధానాన్ని (మల్టీ-మోడల్ కనెక్టివిటీ), రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తారు. ఈ ప్రాజెక్టులను పీఎం-గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక ఆధారంగా రూపొందించారు. ప్రజలు, వస్తువులు, సేవల రవాణాలో ఈ ప్రాజెక్టులు నిరంతర అనుసంధానం కల్పిస్తాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా నిర్మితం కానున్న ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే, భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్ సుమారు 901 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అలాగే, ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 83 లక్షల జనాభాగల 4,161 గ్రామాలకు అనుసంధానం ఇనుమడిస్తుంది.
ప్రతిపాదిత సామర్థ్యం పెంపుదలతో దేశంలోని మహాకాలేశ్వర్, రణథంబోర్ జాతీయ ఉద్యానం, కునో జాతీయ ఉద్యానం, కియోలాడియో జాతీయ ఉద్యానం, మధుర, బృందావన్, మంత్రాలయం (శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం), శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం (కాసాపురం), శ్యామ్నాథ్ ఆలయం, నైమిశారణ్యం (నీమ్సర్) తదితర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు రైల్వే అనుసంధానం మెరుగవుతుంది.
అంతేకాకుండా బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, పెట్రోలియం, ఉక్కు-ఇనుము, ఇనుప ఖనిజం కంటైనర్లు, ఎరువులు వంటి వస్తువుల రవాణాకు ప్రతిపాదిత ప్రాజెక్టులు కీలక మార్గాలు. ఈ రైలు మార్గాల సామర్థ్యం పెంపుతో ఏటా 60 మిలియన్ టన్నుల సరకు అదనంగా రవాణా అవుతుంది. రైల్వేలు పర్యావరణ హితం, ఇంధన పొదుపు సామర్థ్యం గల రవాణా సాధనం. కాబట్టి, వాతావరణ లక్ష్యాల సాధన, జాతీయ రవాణా వ్యయం తగ్గించడంలో కూడా తోడ్పడతాయి. అంతేగాక చమురు దిగుమతిని (37 కోట్ల లీటర్ల మేర), కర్బన ఉద్గారాలను (185 కోట్ల కిలోలదాకా) తగ్గిస్తాయి... అంటే- 7 కోట్ల మొక్కలు నాటడంతో సమానం అన్నమాట!
***
(రిలీజ్ ఐడి: 2258175)
|